కరోనా కేసుల్లో భారత్.. చైనాను దాటేసేలా ఉంది. ఈ క్రమంలో వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో కృషి చేస్తున్న ఇండియన్ అమెరికన్స్ పై కూడా ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ ప్రధాని మోడీతో కలిసి పనిచేసి.. కరోనాను జయిస్తామన్నారు ట్రంప్.
అమెరికాలో ఉంటూ అక్కడి ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయుల కృషిని గుర్తించిన అధ్యక్షుడు ట్రంప్ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభంలో అక్కడి వైద్యులు, శాస్త్రవేత్తలు అందిస్తున్న సేవల్ని ప్రత్యేకంగా కొనియాడారు. ప్రధాని మోదీని తన గొప్ప మిత్రుడిగా పేర్కొన్న ట్రంప్.. కరోనా వైరస్పై యుద్ధంలో ఆయనతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు.
కరోనా వైరస్కు విరుగుడుగా వ్యాక్సిన్ను తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. భారత్లోనూ ఆ దిశగా కృషి జరుగుతోంది. అమెరికాలో జరుగుతున్న పరిశోధనల్లో ఇండియన్-అమెరికన్ శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ వంటి పలు మెడికల్ సైన్సెస్ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, బయో ఫార్మా అంకుర సంస్థల్లో భారతీయులు విశేష కృషి చేస్తున్నారు. అమెరికాలో దాదాపు 40 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నట్లు అంచనా. హైడ్రాక్సీక్లోరోక్విన్ను సరఫరా చేయకుంటే భారత్పై ప్రతీకారం తప్పదని గత నెలలో హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అమెరికా జనాభాలో అనేక మంది భారతీయులున్నారని చెప్పిన ట్రంప్.. వీరిలో చాలా గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఉన్నారని కితాబిచ్చారు. ప్రధాని మోడీ తనకు గొప్ప మిత్రుడన్న ట్రంప్.. సంక్షోభ సమయంలో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. కరోనాపై పోరాటంలో భారత్ కు అండగా ఉంటామని ప్రకటించిన ప్రెసిడెంట్.. వెంటిలేటర్లను ఇండియాకు ఇస్తామన్నారు. అయితే అవి ఎన్ని అనేది మాత్రం చెప్పలేదు. ప్ విజ్ఞప్తి మేరకు గత నెల అమెరికాకు భారత్ భారీ స్థాయిలో హైడ్రాక్సీక్లోరోక్విన్ నిల్వల్ని సరఫరా చేసింది.