కరోనా మహమ్మారికి పుట్టినల్లు అయిన చైనాలో ఇటీవల వ్యాధులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దీంతో జనజీవనం సాధారణ స్థితికి వచ్చేసింది. మరోవైపు చైనాలో ఇవాళ కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక వుహాన్ నగరంలో ఉన్న ప్రజలందరికీ కరోనా టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 50 లక్షల మంది వరకు పరీక్ష చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే సమయంలో చైనాలో ఊహించని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవల వుహాన్తో పాటు చైనాలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వైరస్ కేసులు అధికం అయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇదే సమయంలో రెండో సారి కరోనా కేసులు చైనాను అతలాకుతం చేసే అవకాశాలు ఉన్నట్లు ఆ దేశానికి చెందిన శ్వాసకోస నిపుణుడు జాంగ్ నాన్షాన్ వార్నింగ్ ఇచ్చారు. చైనాలో మళ్లీ వైరస్ కేసులు అత్యధిక స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో రోగనిరోధక శక్తి లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోందన్న జాంగ్ కరోనా కేసులు చైనాను అతలాకుతం చేసే అవకాశాలు ఉన్నట్లు ఆయన ఓ మీడియా సంస్థకు తెలిపారు. చైనా ఓ పెద్ద సవాల్ను ఎదుర్కొంటోందని, ప్రస్తుతం తరుణంలో ఇతర దేశాల కన్నా మెరుగైన స్థానంలో లేమని జాంగ్ నాన్షాన్ తెలిపారు. ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల చాలా మంది వైరస్కు బలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. రెండో దశ వైరస్ కేసులు పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు.
ఇదిలాఉండగా, చైనాలోని బీజింగ్లో మాత్రం కీలక నిబంధన ఎత్తేశారు. ఔట్డోర్స్కు వెళ్లేవారు ముఖానికి మాస్క్లు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బీజింగ్ నగరంలో ఉన్న ప్రజలకు స్థానిక ప్రభుత్వం కొంత ఊరటనిచ్చింది. బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సంస్థ ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రజలు ఎవరు కూడా అతి సమీపంగా ఉండకూడదంటూ మరో వార్నింగ్ ఇచ్చింది.