పాకిస్తాన్ గురించి అక్కడ జరిగే...అక్కడి నుంచి జరిగే అనేకానేక ఆకృత్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సభ్యసమాజం సిగ్గుపడేలా ప్రవర్తించడంలో ఆ దేశం ఏమాత్రం మొహమాటం లేకుండా వ్యవహరిస్తుందనేది మనందరికి తెలిసిన సంగతే. అలాంటి ఓ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అబ్బాయితో మాట్లాడినందుకు ఇద్దరు అమ్మాయిల హత్య చేయబడ్డారు. ఔను. పాకిస్తాన్లో చాలా ప్రాంతాలు ప్రభుత్వ చేతగానితనం వల్ల ఇలాంటి దారుణాలకు కేంద్రంగా మారాయి.
పాకిస్తాన్లోని ఉత్తర వాయువ్య గిరిజన ప్రాంతంలో జరిగిన ఈ ఇద్దరు అమ్మాయిల దారుణ హత్య వివరాలు ఎప్పట్లాగానే...ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఖైబర్-పఖ్తున్క్వా ప్రావిన్స్లోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలోని షామ్ ప్లెయిన్ గారియోమ్ గ్రామంలో మే 14 న జరిగిన ఈ హత్య గురించి అక్కడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 16, 18 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలను వారి బంధువు చంపాడు. పాకిస్తాన్లోని గిరిజన ప్రాంతాల్లో పురుషులతో స్త్రీలు కలవడం అక్కడి పెద్దలు నిషేధించారు. అయితే, ఈ ప్రాంతంలోని కొందరు అబ్బాయిలతో అమ్మాయిలు మాట్లాడుతున్నారు. ఆ మాటల వీడియో వెలుగులోకి వచ్చింది.
52 సెకన్ల ఆ వీడియోలో ఒక యువకుడు ముగ్గురు బాలికలతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక వీడియోలోని ఇద్దరు బాలికలను హత్య చేయించారు. మూడవ అమ్మాయి బతికే ఉందని చెప్పినప్పటికీ, ఆమె ప్రాణానికి ప్రమాదం ఉందని పోలీసు అధికారి తెలిపారు. ఇదే సమయంలో ఆ వీడియోలో ఉన్న యువకునికి కూడా ప్రాణ హాని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, వాళ్లను చంపిన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇంతకీ ఇక్కడ హత్య చేసిన నిందితుడి ఆచూకి ఇంకా దొరకలేదు. కాగా, ఈ ప్రాంతంలో గ్రామాల్లో పెద్దలు చెప్పిందే చట్టంగా నడుస్తుంది. దీంతో ఇటువంటి ఘటనలు ఎక్కువగా ఆ ప్రాంతంలో జరుగుతున్నాయి. మరోవైపు పోలీసుల నిఘా అనేది నామమాత్రం. దీంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. మూడవ అమ్మాయి ఆచూకీ తెలియదని అక్కడ అధికారులు ప్రకటించడం నిదర్శనం.