కరోనా వైరస్ రోజురోజుకూ ఉధృతం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం లాక్డౌన్ నూతన మార్గదర్శకాలను విడుదలచేసిన విషయంత తెలిసిందే. అయితే.. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశం కానున్నది. సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతితో పంటల సాగు విధివిధానాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ను ఈనెల 29వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే నిన్న కేంద్ర ప్రభుత్వం మాత్రం నాలుగో దశ లాక్డౌన్ను మే 31 వరకు పొడిగించింది. ఇదే సమయంలో పలు కీలక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. కొన్ని నిర్ణయాధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది.
ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం మార్గదర్శకాలపై, రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపుగా మిగతా జిల్లాల్లో కరోనా ప్రభావం లేదు. కేసులు నమోదు కావడం లేదు. కాగా, తెలంగాణలో ఆదివారం కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన వాటిలో 37 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,551కి చేరింది. నిన్న ఒక్కరోజే 21 మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 34 మంది కరోనా వల్ల మరణించారు. ప్రస్తుతం 525 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి వరకు 992 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.