కరోనా వైరస్ విషయంలో చైనాను దోషిగా నిలబెట్టేందుకు అంతర్జాతీయంగా పక్కా ప్లాన్ జరుగుతోంది. కొవిడ్-19 పుట్టుక, వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్పందన, కరోనా సంక్షోభంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ నిర్ణయానికి భారత్ సహా 62 దేశాలు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ప్రారంభమైన డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా తీర్మానానికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. కోవిడ్-19 విషయంలో డబ్ల్యూహెచ్ఓ స్పందనపై నిష్పాక్షిక, సమగ్ర విచారణకై తొలుత ఆస్ట్రేలియా పిలుపునివ్వగా.. ఈయూ ఇందుకు మద్దతు పలికింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఈరోజు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కరోనా బయటపడిన తర్వాత తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 73వ వార్షిక సమావేశాలు సోమవారం, మంగళవారం జెనీవాలో కొనసాగుతాయి. ప్రాణాంతక వైరస్ ఉద్భవించిన నాటి నుంచి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం.. నియంత్రణ చర్యలకై సభ్య దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం తదితర అంశాల్లో అంతర్జాతీయ సంస్థ స్పందించిన తీరుపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా కోరాయి.
ఈ క్రమంలో జపాన్, యూకే, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, బ్రెజిల్, కెనడా, భారత్ వంటి 62 దేశాలు వీటికి మద్దతు పలికాయి. కరోనా సంక్షోభానికి కేంద్ర బిందువుగా భావిస్తున్న చైనాపై విచారణకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలకు చైనా దీటుగా బదులిచ్చేందుకు చైనా సైతం సిద్ధమవుతోందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అదే విధంగా డబ్ల్యూహెచ్ఏ నుంచి తైవాన్కు ఆహ్వాన ప్రతిపాదనపై పలు దేశాలు మద్దతునివ్వడాన్ని కూడా చైనా తప్పుబట్టింది. ఆయా దేశాలను తిప్పికొట్టేలా చైనా పక్కా ప్లాన్తోనే ఉన్నట్లు చెబుతున్నారు. .. తమ దేశంలో వైరస్ ఉధృతంగా ఉన్నప్పుడు ప్రపంచదేశాలు తమకేమీ పట్టనట్టుగా ఉన్నాయని, ఆయా దేశాల్లో వైరస్ వ్యాప్తికి అక్కడి ప్రభుత్వాలే కారణమని వాదిందచేందుకు డ్రాగన్ కంట్రీ తేదీలు, లెక్కలతో సహా రెడీగా ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏంజరుగుతుందో చూడాలి మరి.