జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా టార్గెట్ చేసి, విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. ఇక చంద్రబాబుతో పాటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కూడా జగన్పై విరుచుకుపడుతూనే ఉన్నారు. కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి అయితే ఓ రేంజ్లో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు. జగన్ పై ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా ప్రధానంగా చంద్రబాబు.. టీడీపీ వాళ్లు చేసే విమర్శల్లో ఎంత మాత్రం పస ఉండదన్నది ప్రత్యేకంగా చెప్పక్క ర్లేదు.
అదిగో పులి అంటే ఇదిగో మేక అన్న చందంగా టీడీపీ వాళ్లు జగన్.. వైసీపీ పై ఏదో ఒక విమర్శ చేస్తూ ఈ ఐదేళ్లు ఎలా పొద్దు పుచ్చాల్రా బాబు అని అనుకుంటోన్న పరిస్థితి. అయితే అన్నీ పార్టీలు అలా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నా సరే, సీపీఎం మాత్రం సైలెంట్గానే ఉంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు, జగన్ పట్ల సానుకూలంగానే ఉంటూ వచ్చారు. మొదట్లో మధు ఆరోగ్యం బాగోకపోతే, జగన్ ఆయన ఇంటికి వెళ్ళి పలకరించారు కూడా. దీంతో సీపీఎం కాస్త వైసీపీకి అనుకూలంగా ఉందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా మధు కూడా రివర్స్ అయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది.
ఈ క్రమంలోనే ఆ పార్టీ నేతలని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో మధు, జగన్పై మండిపడ్డారు. కరోనా కారణంగా ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని, లాక్ డౌన్ వల్ల.. పనులు లేక పస్తులు ఉంటున్నారన్నారు. ఈ సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం అమానుషమని, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా జగన్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని మధు ఫైర్ అయిపోయారు. మొత్తానికి మొన్నటివరకు సైలెంట్గా ఉన్న మధు కూడా జగన్ని టార్గెట్ చేసేశారు.