కరోనా వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌డంలో తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచిందని కేంద్ర జలశక్తి అభియాన్‌ మంత్రి రతన్‌లాల్‌ కటారియా ప్రశంసించారు. తెలంగాణలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉందని అన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి అభియాన్ మంత్రి ర‌త‌న్ లాల్ క‌టారియా సోమ‌వారం మ‌ధ్యాహ్నం రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ రావుకు ఫోన్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని క‌రోనా వైర‌స్ స్థితిగ‌తులు, తాజా ప‌రిస్థితులు, వేసవిలో మంచినీటి సరఫరాపై ఆయ‌న‌ ఆరా తీశారు. మంచినీటికి ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌టం లేదు అని కేంద్ర మంత్రికి ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టు ద్వారా స్వ‌చ్ఛ‌మైన మంచినీరు ఇంటింటికీ అందిస్తున్నామని ఎర్ర‌బెల్లి వివ‌రించారు. దేశంలోనే అంద‌రికంటే ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించార‌ని, ప‌గ‌లంతా ప‌క‌డ్బందీగా లాక్ డౌన్ విధిస్తూనే, రాత్రిళ్ళు క‌ర్ఫ్యూను అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో క‌రోనా క‌ట్ట‌డిలోకి వ‌చ్చింద‌న్నారు.

 

అయితే హైద‌రాబాద్ లోనే పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయ‌న్నారు. గ్రామాల్లో, జిల్లాల్లో దాదాపు క‌రోనా వైర‌స్ పాజిటివ్‌ కేసులు లేవ‌న్నారు. దీంతో హైద‌రాబాద్ లోని కొన్ని చోట్ల మాత్ర‌మే రెడ్ జోన్లుగా ఏర్పాటు చేశామ‌ని, జిల్లాలు, గ్రామాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లుగానే ఉన్నాయ‌న్నారు. రెడ్ జోన్ల‌లో కంటైన్మెంట్ ని కూడా నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి, కేంద్ర మంత్రి క‌టారియాకు వివ‌రించారు. ఇక ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి ర‌త‌న్ లాల్ క‌టారియా మాట్లాడుతూ.. ఈ విష‌యాలు తాము కూడా విన్నామ‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు దేశ ప‌రిస్థితిని తెలుసుకుంటున్నామని, అందులో భాగంగానే తెలంగాణ వివ‌రాలు అడిగామ‌ని చెప్పారు. అలాగే, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంతో పాటు, క‌రోనా క‌ట్ట‌డిదలోనూ ముందే ఉండ‌టం గొప్ప విష‌య‌మ‌ని, కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని, సీఎం కేసీఆర్ ను అభినందించారు. అయితే.. ఒక‌వైపు తెలంగాణ స‌ర్కార్‌ను ఇక్క‌డి బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తుంటే.. మ‌రోవైపు కేంద్ర‌మంత్రి ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం. కేంద్ర‌మంత్రి తీరుతో తెలంగాణ బీజేపీ నేత‌లు షాక్ తిన్నట్లు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: