ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అనేక అంశాలపై పట్టు, పాలనలో అందెవేసిన చేయి, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, జాతీయ రాజకీయాల్లో పట్టు.. ఇలా ఇవన్నీ సంక్షిప్తంగా చెబితే చంద్రబాబు నాయుడు. అయితే ఈయన రాజకీయ ప్రస్థానంలో అనేక మెరుపులు, అక్కడక్కడ కొన్ని మరకలు కూడా కనిపిస్తాయి. వాస్తవానికి చంద్రబాబు తన రాజకీయ జీవితం మొత్తంలో పూర్తిగా కలసి ఫలనా వారితో కొంత దూరమైనా ప్రయాణించారన్నది లేదు. అందుకేనేమో.. ఆయనది అవకాశవాద రాజకీయం, అధికారం వైపుగా సాగే రాజకీయం అంటారు.
ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టీ చూస్తుంటే.. చంద్రబాబును బీజేపీ పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనినిస్తోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు తో మోడీ కలసి వెళ్లడానికి మధ్యవర్తిత్వం చేసింది సీనియర్ నేత వెంకయ్యనాయుడు అని వార్తలు వచ్చాయి. ఆ తరువాత మోడీ ప్రధానిగా అధికారం చేపట్టి.. బలవంతుడిగా మారారు. ఇక రెండవ సారి కూడా ఆయనకే అధికారం పట్టం కట్టడంతో.. మోడీదీ చూపు దీర్ఘకాలికంగా పగ్గాలు చేపట్టాలన్న దాని మీదనే ఉంది. ఈ క్రమంలోనే మిత్రులు, శత్రువులను ఆచి తూచి ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబును పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు అధికారం కోల్పోయి ఉన్నారు.
ఇలాంటి టైమ్లో ఆయన్ను ఆదుకుని అధికారం ఇచ్చినా.. బీజపీని చెరో వైపున మోస్తున్న మోడీ, అమిత్ షా లకే రిస్క్ అవుతుంది. ఎందుకంటే.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి మార్గాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాడు మోడీని కుర్చీ దింపడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే అప్పుడు పూల్వామా దాడులు జరగకపోయి ఉండినా, దేశంలో ప్రతిపక్షాలు మరింత ఐక్యత చూపినా కూడా 2019 ఎన్నికల్లోనే మోడీ మాజీ ప్రధాని అయ్యేవారు. అందుకే ఈ విషయాన్ని మోడీ కాని, అమిత్ షా కానీ ఎప్పటికీ మరచిపోలేరు.
అయితే ఇప్పుడు చంద్రబాబుకు మళ్లీ సపోర్ట్ చేసి అధికారం దక్కేలా చేసినా.. ఆయన చూపు ఖచ్చితంగా జాతీయ రాజకీయల వైపు ఉంటుంది. ఆయన మళ్ళీ ఢిల్లీ వస్తారు, కొత్త కూటములు అంటారు. చివరకు అసలుకే ఎసరు తెస్తాన్నదే బీజేపీ పెద్దల డౌట్. అదే జగన్ అయితే.. ప్రస్తుతం బీజేపీకి మిత్రునిగానే ఉన్నాడు. అలాగే జగన్ కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి చాలాకాలం ఆయన రాజకీయం ఏపీకే పరిమితం అవుతుంది. ఆయన ఢిల్లీ వైపు అసలు చూడరు. మోడీ, అమిత్ షాలకు కూడా అదే కావాలి. అందుకే మోడీ, అమిత్ షా చంద్రబాబును పక్కన పెట్టి జగన్కే మద్దతు పలుకుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. తమతో పొత్తుకు టీడీపీకి ద్వారాలు ఎప్పుడో మూసేశామంటూ బీజేపీ పెద్దలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఏదేమైనా బీజేపీతో చంద్రబాబు జట్టు కట్టడం ఇప్పట్లో జరిగేది కాదంటున్నారు.