తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి నియంత్రిత పద్ధతిలోనే పంటలు సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. అందులో కూడా పత్తి పంట సాగుపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఇంత పట్టుబట్టారని ఆలోచిస్తే.. దీని వెనుక బలమైన కారణమే ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బట్టకు తీవ్రమైన కొరత ఉందని, ఈ నేపథ్యంలోనే పత్తి పంటను ఎక్కువగా సాగు చేయాలని నిపుణుల సూచనల మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ నేపథ్యంలో మాస్కులు ఎక్కువగా వాడడం వలన ఇప్పటి వరకు ఉన్న మొత్తం బట్టను కూడా మాస్క్ల తయారీకి ఎక్కువగా వినియోగించారు. మీటర్కు వంద రూపాయల మీటర్ కాటన్ బట్టను కూడా ఏకంగా రూ.500 కూడా అమ్మారు. ముందు ముందు కూడా వీటితోపాటు మిగతా వస్త్రాలకు ఎంతో డిమాండ్ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
దీనిని ముందే ఊహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా రైతులను చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడమే కాకుండా పదే పదే నొక్కి చెప్పారు. భారత్లో కూడా వస్త్రతయారీ రంగం పుంజుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ మరొక కారణం కూడా ఉంది. తెలంగాణలోనే అత్యాధునిక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయిన చేనేత కార్మికులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చి ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి భారీ స్థాయిలో పత్తి పంటను సాగు చేయాలని ఆయన పిలుపునిచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ఈ వివరాలను వెల్లడించారు. ఈసారి వరి 40 లక్షల ఎకరాల్లో పండించాలని, పత్తి 70 లక్షల ఎకరాల్లో పండించాలని ఆయన సూచించారు. అలాగే.. 15 లక్షల ఎకరాల్లో కంది, 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు, పసుపు 1.25 లక్షల ఎకరాల్లో పసుపు, మిర్చి 2.5 లక్షల ఎకరాల్లో పండించాలని అన్నారు. ఇక సోయాబీన్ 3.35 లక్షల ఎకరాల్లో పండించాలని సూచించారు.