దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయంతో వణికి పోతున్నారు. కానీ కొంత మంది దొంగలు మాత్రం తమ పని తాము యధేచ్చగా చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారిలో చెడ్డీ గ్యాంగ్ ఒకరు. నైట్ పూట చెడ్డీలు వేసుకొని తాము ఎంచుకున్న ఇంటికి కన్నవేయడం వీళ్ళ పని.. అయితే అడ్డం వస్తే తీవ్రంగా గాయపర్చడం.. అవసరమైతే హత్యలకు కూడా వెనుకాడరు. ఆ మద్య జంటనగరాలతోపాటు నిజామాబాద్ జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకండా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వీరి నెట్ వర్క్ చాలానే ఉందని అంటున్నారు. కొన్ని సార్లు ఈ చెడ్డీ గ్యాంగ్ సీసీ కెమెరాల్లో చిక్కిన పోలీసులు మాత్రం వీరిని కనిపెట్టలేకపోయారు.
తాజాగా చెడ్డీ గ్యాంగ్లోని ఇద్దరు సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపీ పీడీ యాక్స్ కింద కేసులు నమోదుచేశారు. వీరు జంటనగరాలతోపాటు పలు జిల్లాల్లో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ దొంగలు మహారాష్ట్రకు చెందిన చౌహాన్ తారా సింగ్, మహ్మద్ సోనుగా గుర్తించారు. ఈ దొంగలు చాలా నేర్పుగా.. పక్కా ప్లానింగ్ తో ఉంటారని.. తాళం వేసి వున్న ఇండ్లు, ఫ్లాట్లను గుర్తించేందుకు రెండు, మూడు రోజులు రెక్కీ నిర్వహించి ఆ తర్వాత అందినకాడికి దోచుకొని పారిపోతారని చెప్పారు. ఈ గ్యాంగ్ బెడ్ షీట్లు అమ్ముతున్నట్లు ఉదయం పూట తిరుగుతూ ఎవ్వరికి అనుమానం రాకుండా ఉంటారని పోలీసులు అంటున్నారు.
గుజరాత్కు చెందిన చెడ్డీ గ్యాంగ్ 2019 డిసెంబర్లో వరుస దోపిడీలు చేయడంతో పోలీసులకు కంటి మీద కునుకులేకుండా పోయింది. ముఠా నాయకుడు చౌహాన్ తారాసింగ్ పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఈయన మహారాష్ట్ర అకోలా జిల్లాలోని ఖిడ్కి గ్రామంలో ఉంటున్నాడు. ఈ ముఠా ఇప్పటివరకు ఎనిమిది దోపిడీలు చేశారని పోలీసులు గుర్తించారు. ఇద్దరు సభ్యులను అరెస్ట్చేసి వారి నుంచి 150 గ్రాముల బంగారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి, నాలుగు మొబైల్ ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకొన్నారు.