అంఫాన్‌ తుఫాన్ కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తోంది. ఏ క్షణంలోనైనా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తుపాను హెచ్చరికలతో తీర ప్రాంత జిల్లాలు వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి. 

 

పశ్చిమ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంఫాన్‌ పెను తుఫాన్ కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన కొద్ది గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ఇది ప్రయాణిస్తోందని తెలిపింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 570 కి.మీ, పశ్చిమ్‌బెంగాల్‌లోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 720 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా తుఫాన్‌ ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం బెంగాల్‌-బంగ్లాదేశ్‌ తీరంలోని హతియా దీవుల వద్ద తీరం దాటే సూచనలు ఉన్నట్టు అధికారులు వివరించారు. తీరం దాటే సమయంలో అంఫన్‌ అత్యంత తీవ్ర తుఫాన్ గా మారే  సూచనలు ఉన్నాయి. గంటకు 165 నుంచి 195 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

 

అంఫాన్‌ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరంలో ముందే కనిపిస్తోంది. రెండు రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి తీరాన్ని బలంగా తాకుతున్నాయి. వీటి ప్రభావానికి రహదారికి రక్షణగా వేసిన రాళ్లు ఎగిరి రోడ్డుపై పడుతున్నాయి. రహదారి ధ్వంసమై వాహనాల రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఉబ్బార, మాయపట్నం, సూరాడపేట, కోనపపుపేటలో రాకాసి అలలు గృహాలపై విరుచుకుపడుతున్నాయి. కెరటాల ఉద్ధృతికి పలు గృహాలు నేలకూలడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. 

 

మరోవైపు... శ్రీకాకుళం జిల్లాలోనూ అంఫాన్‌ తుపాను ప్రభావం కనిపిస్తోంది. జిల్లా అంతటా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. సముద్రతీర ప్రాంతంలో వాతావరణం చల్లబడింది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. గొట్టాబ్యారేజీ నుంచి దిగువకు రెండు గేట్ల ద్వారా వంశధార నదిలోకి నీరు విడుదల చేశారు. ఇప్పటికే కోసి ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, సహాయం కోసం 08942-240557 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు కలెక్టర్. మొత్తానికి...అంఫాన్ తుపాను తీర ప్రాంత జిల్లాల్లో పెను ప్రభావమే చూపించే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: