తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, జగన్ చక్కటి దోస్తీతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. కృష్ణా జలాల వినియోగం విషయంలో ఈ ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. అయితే, దీనికి తన విలేకరుల సమావేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా, ఈ ఇద్దరు నేతలు ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు. ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకోగా...అదే బాటలో జగన్ సర్కారు నడవనుంది. ఇది ప్రజా రవాణలో కీలకమైన బస్సుల గురించి.
కరోనా లాక్ డౌన్ ను మే 18 నుంచి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. దాదాపు అన్ని రంగాలకు సడలింపులు ఇచ్చింది. ప్రజా రవాణాను పునరుద్దరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిచ్చింది. దీంతో తెలంగాణలో మంగళవారం (మే 19) నుంచే బస్సులు కేసీఆర్ సర్కార్ స్టార్ట్ చేసింది. అయితే ఏపీలో రెండు రోజుల ఆలస్యంగా 21 నుంచి బస్సులు తిప్పేందుకు నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో 58 రోజుల తర్వాత మంగళవారం) ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ సీట్లు ఉన్న మేరకే ప్రయాణికులను ఎక్కించుకున్నారు. అన్ని డిపోల్లో ఇప్పటికే బస్సులను శానిటైజ్ చేసి సిద్ధం చేశారు. ప్రతి ట్రిప్పు తర్వాత శానిటైజ్ చేస్తారు. ప్రతి ప్యాసింజర్ కు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. మాస్క్ కట్టుకుంటేనే బస్సులోకి అనుమతిస్తారు. కండక్టర్, డ్రైవర్లకూ మాస్క్ తప్పనిసరి. బస్సు ఎక్కక ముందే కండక్టర్ వద్ద టికెట్లు తీసుకోవాలి. రోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే బస్సులు నడుస్తాయి. గమ్య స్థానానికి చేరుకునేందుకు ఒక గంట గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఎంజీబీఎస్ కంటెయిన్మెంట్ జోన్లో ఉండటంతో.. జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే బస్సులేవీ అక్కడి వరకు వెళ్లవు. ఎక్కువ బస్సులు జేబీఎస్కే వస్తాయి.
కాగా, ఏపీలో దాదాపు రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడెక్కబోతున్నాయి. మే 21 నుంచి బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తూ బస్సులను తిప్పనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు, ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది అంతా మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసింది. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు సంబంధించి ఇప్పటికే ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఆర్టీసీ ప్రారంభించింది. అయితే ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణం చేయాలన్న సరే ముందుగా ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది. స్పందన పోర్టల్లో మొబైల్ నంబర్ను రిజిస్టర్ చేసుకున్న వారికే ఏపీఎస్ఆర్టీసీలో టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.