దేశంలో ఫిబ్రవరి మాసంలో కరోనా కేసులుమొదలయ్యాయి. అప్పటి నుంచి రవాణా వ్యవస్థపై ఆంక్షలు మొదలయ్యాయి. మార్చి లో లాక్ డౌన్ మొదలైంది. లాక్ డౌన్ కారణంగా డిపోలకే పరిమితం అయిన ఆర్టీసీ బస్సులు ఇప్పటికే తెలంగాణలో పునఃప్రారంభమయ్యాయి.ప్రయాణికులను చేరవేసేందుకు కావాల్సిన జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారు.దాదాపు రెండు నెలల తర్వాత బస్సులు రోడ్లపైకి వస్తుండటంతో ప్రయాణాలు కోసం ప్రజలు సిద్ధమౌతున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంతో మొదటి దశలో కేవలం 1683 బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని ఏపీ ఆర్టీసీ ఎండీ ప్రతాప్ ప్రకటించారు.
డిపోల్లో ఉన్న బస్సులను శుభ్రం చేసే కార్యక్రమం కొనసాగుతోంది. గత 55 రోజులుగా డిపోలకే బస్సులు పరిమితం కావడంతో... వాటి ఇంజిన్ కండిషన్ ను చెక్ చేస్తున్నారు. రేపటి నుంచి ఏపీలో బస్సులు తిరగనున్న నేపథ్యంలో... కొన్ని వివరాలను తెలుసుకుందాం. బస్సులో ప్రయాణించే వారు కచ్చితంగా కొన్నిరూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడపడం లేదని తెలిపారు. ఆయా రాష్ట్రాల అనుమతి తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
బస్సుల పని తీరు :
- సూపర్ లగ్జరీ,డీలక్స్, ఎక్స్ప్రెస్,పల్లెవెలుగు బస్సులు నడుస్తాయి.
- రోజు 12 గంటల పాటు మాత్రమే సేవలు.
- ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే పరిమితం.
- విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు నడపరు.
- ఏసీ, సిటీ బస్సులు డిపోలకే పరిమితం.
- అందుబాటులోకి ఆన్లైన్ రిజర్వేషన్స్ సౌకర్యం.
- కొంత కాలం బస్సుల్లో ఆన్ బోర్డు కండక్టర్లు ఉండరు.
నిబంధనలు ఇవే :
- ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలి.
- బస్సు ఎక్కే ముందే టికెట్లు ఇస్తారు. మధ్యలో ఇచ్చే ప్రసక్తే లేదు.
- థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే బస్సు కదులుతుంది.
- భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
- పిల్లలు, వృద్ధులు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకూడదు.
- నగదు రహిత చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం