డోక్లాం ఈ పేరు వింటే చాలు 2017 సెప్టెంబర్ రెండో వారంలో చైనా- భారత్ సరిహద్దులో జరిగిన ఘటనే గుర్తుకు వస్తుంది. కానీ ఆనాడు భారత్ చైనా సైనికుల మధ్య ఏం జరిగిందన్నది మాత్రం చాలా వరకు బయట ప్రపంచానికి తెలియదు. భారత్ భూ భాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను భారత సైనికులు ఎలా ఎదుర్కొన్నారన్న విషయంలో మాత్రం ఎవరికీ సరైన అవగాహన లేదు. తాజాగా.. ఇందుకు సంబంధించిన విషయం బయటకు వచ్చింది.. రక్షణ రంగ జర్నలిస్ట్ నితిన్ గోఖలే రాసిన *సెక్యూరింగ్ ఇండియా ద మోడీ వే*.. అనే పుస్తకంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆ వివరాలేమిటో చూద్దాం. డాక్లాం ప్రాంతంలో ఇండో టిబెట్ సైనికులు పహారా కాస్తున్నారు. ఆ ప్రాంతంలోకి చైనా సైనికులు చొరబడేందుకు ప్రయత్నించారు. సాధారణంగా ఇది నిత్యం జరిగేదేనని భారత సైనికులు అనుకున్నారు. కానీ ఏకంగా మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోకి చైనా సైనికులు పదేపదే చొరబడేందుకు ప్రయత్నించారు. అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు తెల్లవారేసరికి నిర్మాణ సామాగ్రి తో సుమారు వెయ్యి మంది సైనికులు అక్కడికి చేరుకున్నారు.
వెంటనే అప్రమత్తమైన భారత సైనికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. చైనా సైనికులు నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో చైనా సైనికులు నిర్మాణాలు ఆపేసి అక్కడే ఉన్నారు. ఆ కొద్ది సేపటికే ఆర్మీ ఉన్నతాధికారులు విమానాల్లో అదనంగా భారత బలగాలను అక్కడికి పంపించారు. ఇలా ఏకంగా ఆరు వేల మంది భారత సైనికులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఇదే 2017 సెప్టెంబర్ నెల 17వ తేదీన చైనా అధినేత జిన్పింగ్ సతీమణితో కలిసి అహ్మదాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు. చైనా అధినేత అహ్మదాబాద్లో పర్యటిస్తున్న సందర్భంలోనే భారత భూభాగంలోకి చైనా సైనికులు చొరబడి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. తమదేశ అధినేత భారత్లో ఉన్నప్పుడు భారత సైనికులు దాడి చేయడానికి ముందుకు రారని, ఇలాంటి సమయంలోనే ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని చైనా సైనికులు అనుకున్నారు. కానీ భారత సైనికులు మాత్రం చైనా ప్రయత్నాలను తిప్పికొట్టారు. అప్పట్లో మరో టాక్ కూడా వినిపించింది. చైనా సైన్యంలో ఒక వర్గం జిన్పింగ్కు వ్యతిరేకంగా ఉందని, అందుకే చైనా అధినేత అహ్మదాబాద్ పర్యటనలో ఉండగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు చేసేందుకు ఆ వర్గం ప్రయత్నించిందనే వాదన కూడా వినిపించింది. ఏది ఏమైనా ఆనాడు భారత సైనికులు చూపిన తెగువ ఈరోజు ఇలా ఈ పుస్తకం ద్వారా వెలుగు చూసింది.