కరోనా వైరస్ విధ్వంసంతో ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి. ఆర్థిక రంగాలు అతలాకుతలం అవుతున్నాయి. చైనా నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని అనుకుంటున్నాం. కరోనా భయంతో అసియా దేశాలనుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతున్నాయని అమెరికా కాంగ్రెషనల్ నివేదికలో వెల్లడైంది. ఇందులో భారత్ నుంచి ఏకంగా 16 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 1.3లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు తరలిపోయాయని ఈ నివేదికలో బయటపడింది. ఆసియా దేశాలన్ని కలిపి మొత్తం 26 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు కోల్పోయినట్టు ఆ నివేదికలో తెలిసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆసియా దేశాలు భారీ ఆర్థిక మాద్యంలో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంమవుతోంది. అంతేగాకుండా.. ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా కరోనా ప్రభావం భారీగా ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ వంటి దేశాల్లో మూడు కోట్ల మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ప్రభుత్వం సాయం కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. 2020 తొలి త్రైమాసికం లెక్కల ప్రకారం.. యూరోజోన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 3.8 శాతం మేర తగ్గిపోవడం గమనార్హం. మరోవైపు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) దాదాపు 4.8 శాతం మేర పడిపోయిందని నివేదికలో పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత ఈ స్థాయిలో జీడీపీ పడిపోవడం ఇదే తొలిసారి అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కరోనా సంక్షోభం ప్రపంప దేశాలకు పెను సవాలు విసురుతోందని, కరోనా కట్టడి చర్యలు, ఆర్థిక ఉద్దీపనల మధ్య సమతుల్యం సాధించడంలో ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు. వీటి కారణంగా ప్రపంచ దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయని అమెరికా కాంగ్రెషనల్ ఈ నివేదిక తేల్చిచెప్పింది.