ఏపీకి కరోనా ముప్పు పొంచి ఉంది. విదేశాల నుంచి ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో తిరిగి వస్తున్న సమయంలో వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. కరోనా విజృంభణ అడ్డుకోవడం అంత సులభం కాదు. అయితే ఈ విషయంలో జగన్ సర్కారు బాగానే అప్రమత్తంగా ఉంది. కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు అమలు చేస్తున్నామని చెబుతోంది. ఒక్క విశాఖ జిల్లాలోనే ఐసోలేషన్కు సంబంధించి 2 వేల బెడ్స్ సిద్ధంగా ఉంచారు.
విశాఖ జిల్లా రూరల్ పరిధిలో దాదాపు 59 లక్షల మాస్కులు, జీవీఎంసీ పరిధిలో 25 లక్షల మాస్కులు పంపిణీ చేశారు. ఇవి కాకుండా 64 వేల పీపీఈ కిట్స్ సిద్ధంగా ఉంచారు. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్స్, మాస్కులు, పేషంట్లకు కావాల్సిన బెడ్స్, వెంటిలేటర్స్ అన్ని ఉన్నాయి. ఒకవేళ విశాఖలో కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు అందరం సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు డాక్టర్లతో కూడా చర్చించారు. విశాఖ జిల్లాలో మొత్తం 3,231 మంది క్వారంటైన్లో అడ్మిట్ కాగా, ప్రస్తుతం 492 మంది మాత్రమే క్వారంటైన్లలో ఉన్నారు.
విశాఖ జిల్లాలో క్వారంటైన్ సెంటర్లు రూరల్, సిటీలో కలిపి మొత్తం 70 ఉన్నాయి. బెడ్స్ రూరల్ పరిధిలో 3 వేలు, సిటీలో 7 వేల బెడ్స్ రెడీ చేసి పెట్టారు. నిన్న అబుదాబీ, పిలిఫిన్స్ నుంచి రెండు అంతర్జాతీయ విమానాలు విశాఖకు వచ్చాయి. విమానాల్లో వచ్చిన వారిని ఆయా జిల్లాల్లోని క్వారంటైన్కు తరలించారు. ఇందులో విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన 84 మందిని క్వారంటైన్కు తరలించారు.
కోవిడ్ ఆస్పత్రి విమ్స్లోని ఐసోలేషన్ వార్డులో 29 మంది కరోనా పేషంట్స్ ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ముగ్గురు, విజయనగరం 2, విశాఖపట్నం 10, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు 14 మంది ఉన్నారు. వలస కార్మికులు ఉండాలంటే విశాఖ సిటీలో షెల్టర్లు ఉన్నాయి. వారు స్వస్థలాలకు వెళ్లాలనుకుంటే బస్సులు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇలా కరోనాపై పోరుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది జగన్ సర్కారు.