పోలవరం ప్రాజెక్టు.. ఆంధ్రుల కలల ప్రాజెక్టు. ఇది పూర్తయితే అటు విశాఖ నుంచి ఇటు నెల్లూరు వరకూ అనేక జిల్లాలకు నీటి కరువు తీరిపోతుంది. అయితే ఏపీకి ఇంత కీలకమైన ప్రాజెక్టు దశాబ్దాల తరబడి ఎవరూ పట్టించుకోకుండా కాలగర్బంలో కలిసిపోయంది. ఆ తర్వాత వైఎస్ సీఎం అయ్యాక మళ్లీ పోలవరానికి ఊపు వచ్చింది. అందుకే.. పోలవరం ప్రాజెక్టును దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేస్తారని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు.
పోలవరం ప్రాజెక్టును డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ పరిశీలించారు. నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్లను కూడా పరిశీలించారు. ఐదేళ్ల పాలనలో నిర్వాసిత కుటుంబాలకు చంద్రబాబు చేసిందేమీ లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు అంటే కాపర్ డ్యామ్ రెండు కాల్వలు తవ్వడం కాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసిత కుటుంబాలను ఆదుకోవాలని, సీఎం వైయస్ జగన్ చర్యలు చేపట్టారన్నారు.
పోలవరం ప్రాజెక్టు వైయస్ఆర్ ప్రారంభిస్తే ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ పూర్తిచేస్తారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. జూలై చివరి నాటికి ఆర్అండ్ఆర్ కాలనీలు పూర్తి చేసి 15 వేల కుటుంబాలను తరలిస్తామని, మనసున్న నేత మా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు.
అయితే ఎవరు ప్రారంభించినా.. ఎవరు క్రెడిట్ కొట్టేసినా.. ఆంధ్రులకు కావాల్సింది పోలవరం పూర్తి కావడం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి వివాదం లేని ప్రాజక్టు ఈ పోలవరం ఒక్కటే. దాన్ని సత్వరం పూర్తి చేస్తే ఏపీ ప్రగతి పథంలో దూసుకుపోతుందనడం లో సందేహం లేదు.