అల్‌కాయిదా ఉగ్రవాది, ఆ సంస్థకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించిన‌ మహ్మద్‌ ఇబ్రహీం జుబేర్‌(40) భారత్‌ చేరుకున్నాడు. ఉగ్ర లింకులపై ఐదేళ్ల జైలు జీవితం అనుభవించిన అత‌డిని ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా వచ్చిన విమానంలో అమెరికా ప్రభుత్వం ఇక్కడికి పంపింది. ఈనెల 19న అమృత్‌సర్‌ చేరుకున్న జుబేర్‌ను అమృత్‌సర్‌ సమీపంలోని కోవిడ్‌ వైద్య కేంద్రానికి 14 రోజుల క్వారంటైన్‌ నిమిత్తం తరలించారు. జుబేర్‌ తల్లిదండ్రుల స్వస్థలం హైదరాబాద్‌లోని టోలిచౌకి. కానీ.. ఈ కుటుంబం కొన్నేళ్ల క్రితమే అబుదాబిలో స్థిరపడింది. అబుదాబిలోనే చదువుకున్న జుబేర్‌ బీటెక్‌ చదవడానికి హైదరాబాద్‌కు వచ్చాడు. బంజారాహిల్స్‌ ప్రాంతంలో ఉంటూ అక్కడే ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశాడు. ఉన్నత విద్య కోసం 2001లో అమెరికా వెళ్లిన జుబేర్‌ 2005 వరకు అక్కడి వర్సిటీ ఆఫ్‌ ఇలినాయిస్‌లో చ‌దివాడు. 2006లో అమెరికా అమ్మాయినే వివాహం చేసుకుని ఆ దేశ పౌరసత్వం పొందాడు. టెక్సాస్‌లోని టొలెడో ప్రాంతం లో నివసిస్తున్న ఇతడికి అల్‌కాయిదాతో సంబంధాలు ఏర్ప‌డ్డాయి. అప్ప‌టి నుంచి ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చే స్థాయికి ఎదిగాడు.

 

జుబేర్‌ తన సోదరుడు యాహ్యా మహ్మద్‌ ఫారూఖ్‌నూ అదేబాట పట్టించాడు. వీరి వ్యవహారాలను గుర్తించిన ఎఫ్‌బీఐ 2015లో ఇద్దరినీ అరెస్టు చేసింది. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. ఈ కేసు విచారిస్తున్న జడ్జీని కూడా చంపేందుకు పథకం పన్నినట్లు తేలడంతో ఫారూఖ్‌కు అమెరికా కోర్టు ఇరవై ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించడం గ‌మ‌నార్హం. అయితే.. జుబేర్‌  నేరం అంగీకరించడంతో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షాకాలం గత వారంతో పూర్తయింది. జుబేర్‌ భారత పౌరుడు కావడంతో ఇక్కడికే పంపేయాలని అమెరికా నిర్ణయించింది. ఆ లాంఛనాలు పూర్తి చేసిన అమెరికా అధికారులు టెక్సాస్‌ నుంచి వందే భారత్‌ విమానంలో గురువారం ఢిల్లీకి పంపారు. 14 రోజుల క్వారంటైన్‌కోసం అమృత్‌సర్‌లోని కోవిడ్‌ కేంద్రానికి తరలించారు. అనంతరం ఢిల్లీకి తీసుకువెళ్ళి దర్యాప్తు విభాగాలు మళ్లీ విచారించనున్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాతే హైదరాబాద్‌కు పంపిస్తారని తెలిసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: