ఆహార పదార్థాలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌలభ్యం, ఇంటివద్దకే అందించడంలో పేరొందిన స్విగ్గి, జొమాటోలకు ఊహించని షాక్. లాక్డౌన్ నేపథ్యంలో స్విగ్గి, జొమాటో, ఉబెర్ ఈట్స్ సంస్థలు సరఫరా సేవలు నిలిచిపోయి ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నాయి. కొన్నిప్రాంతాల్లో ఉద్యోగులను సైతం తొలగించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఇంకో సాక్ సైతం ఆ కంపెనీలకు వచ్చి పడింది. ఈ రెండు ఈ కామర్స్ వేదికలకు పోటీగా అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్ రంగంలో దిగింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ బెంగళూరులోని ఎంపికచేసిన కొన్ని ప్రాంతాల్లో ఆహార పదార్థాలను చేరవేసే కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. బెంగళూరులోని మహదేవపుర, మారథల్లి, వైట్ఫీల్డ్స్, బెళ్లందూర్ ప్రాంతాల్లోని 100 కు పైగా రెస్టారెంట్ల నుంచి తొలుత అమెజాన్ ఫుడ్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. తొలుత ఈ సేవలను ఆరు నెలలపాటు నిర్వహించి పరీక్షించనున్నారు. తొలుత బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో టెస్టింగ్ ప్రాతిపదికన సరఫరా చేయాలని నిర్ణయించినట్లు అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. బెంగళూరులో సేవలు సంతృప్తికరంగా కొనసాగించిన తర్వాత ముంబై, ఢిల్లీల్లో సేవలను ప్రారంభించేందుకు అమెజాన్ కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.
కాగా, ఫుడ్ సప్లైయింగ్లోకి అమెజాన్ రాకతో స్విగ్గి, జొమాటోలకు పెద్ద సవాలు ఎదురుకానున్నదని చెప్పవచ్చు. ఇదిలాఉంగా, కరోనా నేపథ్యంలో మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించడానికి ఇంటి వద్దకే మద్యం సరఫరా చేయాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను స్విగ్గీ, జొమాటో వంటి డోర్ డెలివరీ సంస్థల సేవలు ఉపయోగించుకోనున్న సంగతి తెలిసిందే. కాగా, . జొమాటో ఇప్పటికే కిరాణా వస్తువులను కూడా అందజేస్తున్నది. దేశంలో ప్రస్తుతం ఆల్కహాల్ డెలివరీ చేసేందుకు చట్టపరమైన నిబంధణలు లేవు. కానీ ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రం జొమాటో ఇతర సంస్థల ద్వారా విక్రయాలు జరిపించాలని అనుకుంటున్నది. లిక్కర్ హోం డెలివరీ ద్వారా మందు వినియోగం బాధ్యతయుతంగా జరుగుతోందని జొమాటో భావిస్తున్నది.