దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అనేక ప్రత్యేకతలను తన సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి, విభిన్నతలు, వినూత్న సేవలు ఇలా అన్నింటి హైదరాబాద్ తన ప్రత్యేకతను నిలుపుకొంటోంది, తెలుగువారి ప్రత్యేకతను చాటి చెప్తోంది. అలాంటి హైదరాబాద్లో తాజాగా ఓ వినూత్నమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ కీలక నిర్ణయం తీసుకుంది.
నగరంలో ఒక చోట నుంచి మరోచోటికి వస్తువులను రవాణా చేయడానికి ప్రజలు ఒక్కోసారి ఎంతో ఇబ్బంది పడుతుంటారు ఇప్పటికే పోస్టల్, కొరియర్ వంటి సేవలు ఉన్నప్పటికీ వాటిలోని కొన్ని సమస్యల ఆధారంగా అందరి అవసరాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో కనెక్ట్ పేరుతో ప్యాకేజీ సర్వీసులసు ఊబర్ మొదలుపెట్టింది. హైదరాబాద్, ఢిల్లీ, నోయిడా, చెన్నై, చండీగఢ్లలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది.
ఉబర్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రభుజీత్ సింగ్ ఈ సేవల గురించి వివరిస్తూ, ఐదు కిలోల కంటే తక్కువ బరువున్న ప్యాకేజీలను టూవీలర్ ద్వారా డెలివరీ ఇస్తామని తెలిపారు. నగరంలో ఒక చోట నుంచి మరోచోటికి వస్తువులను రవాణా చేయడానికి కనెక్ట్ సర్వీసు ఉపయోగపడుతుందని వెల్లడించారు. వినియోగదారుడు తన వస్తువును పంపించాక, ఉబర్ యాప్ ద్వారా దానిని ట్రాక్ చేసుకోవచ్చునని ప్రభుజిత్ సింగ్ ప్రకటించారు. డెలివరీ స్టేటస్ను షేర్ చేయొచ్చునని ఆయన వెల్లడించారు. ఉబర్ టెక్నాలజీ, నెట్వర్క్ ద్వారా సమర్థంగా సేవలు అందించగలుగుతున్నామని వివరించారు. కనెక్ట్ సేవలు అందించే సిబ్బందికి గవర్నమెంట్ రూల్స్పై ట్రైనింగ్ ఇప్పించామని స్పష్టం చేశారు. ప్రస్తుత కరోనా కలకలం నేపథ్యంలో, సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ను పాటిస్తూ వస్తువులను డెలివరీ ఇస్తున్నామని ప్రభుజీత్ సింగ్ స్పష్టం చేశారు. కోల్కతా, జైపూర్, గువాహటి, గుర్గావ్లో ఇది వరకే ప్యాకేజీ సర్వీసులను అందిస్తున్నామని, వాటికి మంచి స్పందన వస్తోందని ఉబర్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.