తెలంగాణ‌లో రూర‌ల్ ఏరియాలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా.. మహబూబాబాద్‌, భూపాలపల్లి జిల్లాల్లో వలస కూలీలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌ వచ్చింది. మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెంలో ఒక్కరికి, అమ్మాపురానికి చెందిన 5 నెలల బాలుడికి, మడిపల్లికి చెందిన ఇద్దరికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. వీరంతా మహారాష్ట్ర నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. లాక్‌డౌన్‌ లో ఇచ్చిన సడలింపులతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న 2600 మంది ఇటీవల జిల్లాకు వచ్చారు. మహారాష్ట్రలోని బోర్‌వెల్లి నుంచి 12 మంది కలిసి బస్సులో ఈ నెల 16న తొర్రూరు, కంఠాయపాలెం, అమ్మాపురం, మడిపల్లికి చేరుకున్నారు.

 

కంఠాయపాలేనికి చెందిన ఒకరు అనారోగ్యంగా ఉండడంతో మానుకోట దవాఖానకు 17న తరలిస్తుండగా మృతి చెందాడు. అధికారులు మృతుడి భార్యను జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులు, బస్సులో కలిసి ప్రయాణించిన వారు వీరి ప్రైమరీ కాంటాక్టులకు సంబంధించి 27 మందిని మహబూబాబాద్‌  ఐసోలేషన్‌ వార్డులో ఉంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించారు. కంఠాయపాలెంలో కరోనా వచ్చిన వ్యక్తి అల్లుడికి, అ మ్మాపురానికి చెందిన 5 నెలల బాలుడికి, మడిపల్లికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం ముగ్గురు వలస కూలీలు, ఒక వైద్య సిబ్బందితో పాటు మరో 20 మంది నమునాలు పరీక్షకు పంపగా ఫలితాలు రావాల్సి ఉన్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీరాం తెలిపారు.

 

కంఠాయపాలెం, మడిపల్లి, అమ్మాపురం గ్రామాల్లో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నా యి. ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.  అలాగే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేటకు చెందిన వృద్ధ దంపతుల్లో ఒకరికి పాజిటివ్ వచ్చింది. ముంబా యిలో ఉన్న తమ కుమారుడి వద్దకు 50 రోజుల క్రితం వెళ్లారని, అక్కడి నుంచి ఈనెల 14న స్వగ్రామానికి చేరుకున్నారని తెలిపారు. వృద్ధులను అధికారులు హోంక్వారంటైన్‌లో ఉంచి గురువారం రాత్రి పరీక్షలు నిర్వహించగా భర్తకు పాజిటివ్‌, అతడి భార్యకు నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: