తెలంగాణలో ఒక్కసారిగా కరోనా మరణాలు పెరుగడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. మొన్న ఐదురుగు మరణించగా.. నిన్న ముగ్గురు మృతి చెందడం గమనార్హం. కేవలం రెండు రోజుల్లోనే ఎనిమిది మంది కరోనాకు బలికావడంతో అధికారవర్గాలతోపాటు ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. అయితే.. కరోనా నిర్ధారణ కేసులు అతి తక్కువ సంఖ్యలో చేయడం వల్లే.. కరోనా వైరస్ వ్యాప్తిని ప్రభుత్వం అంచనా వేయలేకపోతుందని పలువురు నిపుణులు అంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించారు.ఆ తర్వాత వైద్యులు ఆయన భార్యకు పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని తేలింది. అంటే.. ఆయన కరోనాతో మృతి చెంది ఉంటాడని పలువురు అంటున్నారు.
వేగవంతంగా పరీక్షలు చేయకపోవడం వల్లే.. సకాలంలో వైద్యం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో కేవలం 21వేల టెస్టులు మాత్రమే జరిగాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాపై ఇంతే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్లో తీవ్ర నష్టం ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని అధికారులు అంచనా వేయలేకపోతున్నారని.. ఇప్పటికైనా ప్రభుత్వం వేగవంతంగా పరీక్షలు చేయాలని సూచిస్తున్నారు.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటివరకు సుమారు రెండున్నర లక్షలకుపై పరీక్షలు చేయగా.. తెలంగాణలో ఇప్పటివరకు కేవలం 22వేలకుపైగా మాత్ర పరీక్షలు చేయడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో శుక్రవారం మరో 62 కరోనా కేసులు మోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 42, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు ఉండగా.. 19 మంది వలసదారులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,761కి చేరుకుంది. కరోనాతో శుక్రవారం ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 48కి చేరింది. తాజాగా ఏడుగురు కోలుకోగా, వారితో కలిపి ఇప్పటివరకు 1,043 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 670 మంది చికిత్స పొందుతున్నారు. వలసదారుల్లో కరోనా కేసులు ఎక్కువ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 118 వలసదారులు ఉండడం గమనార్హం.