ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో కి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక షాకులు తగిలాయి. ఇక ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ కి గుడ్ బై చెప్పేశారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం చంద్రబాబుకు బై బై చెప్పేసి వైసీపీ చెంతకు చేరిపోయారు. ఇక పార్టీలో ఉన్న వారిలో కూడా ఎవరు ఎప్పుడు ? బయటకు వెళతారో ? కూడా తెలియని పరిస్థితి.
ఇకిప్పుడు టీడీపీ కాస్తో కూస్తో బలంగా ఉందని భావిస్తోన్న విశాఖ పట్నం జిల్లాలో కూడా టీడీపీకి దిమ్మతిరిగే షాక్ తగలనుందని సమాచారం. విశాఖ నగరంలోని నాలుగు సీట్లలో టీడీపీ ఘనవిజయం సాధించింది. విశాఖ నార్త్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబు వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక పశ్చిమలో గణబాబు, దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. గతంలో హుదూద్ తుఫాన్ నేపథ్యంలో చేసిన సేవల నేపథ్యంలో నే నగరంలో టీడీపీ స్ట్రాంగ్గా ఉంది.
అయితే ఇప్పుడు వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు మూడు దారులు చూసుకో బోతున్నట్టు టాక్..? గంటా పార్టీలో ఉన్నా లేనట్టే. ఆయన ఎప్పుడు పార్టీలో ఉంటారో ? తెలియని పరిస్థితి. ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అయిన వాసుపల్లి గణేష్ కుమార్, గణబాబు ఇద్దరూ కూడా పార్టీ మారిపోతారని వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ వైసీపీ వైపు చూస్తున్నారని టీడీపీ వాళ్లకే అనుమానాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న గణబాబు విశాఖ ప్రమాదం విషయంలో జగన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం కూడా టీడీపీకి నచ్చలేదంటున్నారు. ఏదమైనా మరో నెల రోజుల్లో టీడీపీలో మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయం.