క‌రోనా క‌ష్టాల స‌మ‌యంలో ప్ర‌భుత్వం రూపంలో అందే ప్ర‌తి స‌హాయం ముఖ్య‌మైన‌ద‌నే సంగ‌తి తెలిసిందే. జ‌న్‌ధ‌న్ ఖాతాదారులు, రేషన్ కార్డు క‌లిగి ఉన్న‌వారు, మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ల‌బ్ధిదారుల‌కు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా క‌ష్ట‌కాలంలో వివిధ రూపాల్లో స‌హాయం అందిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రేష‌న్ కార్డు క‌లిగి ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ రూ.1500 వారి ఖాతాల్లో డిపాజిట్ చేసింది. అయితే, రేష‌న్ తీసుకొని వారికి ఈ విష‌యంలో షాక్ త‌గిలింది. వారికి ఆ ప్ర‌యోజ‌నాలు అంద‌లేదు. అయితే, తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

 

రేష‌న్ కార్డుంటే చాలు మూడు నెల‌ల పాటు రేష‌న్ తీసుకోక‌పోయినా రూ.1500 డిపాజిట్ చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఈ విష‌యం గురించి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తాజాగా మీడియాకు వెల్ల‌డించారు. వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఏప్రిల్ నెలలో రేషన్ తీసుకున్న లబ్దిదారులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన రూ. 1500 నగదును వారి ఖాతాలో జమ చేసిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్  ప్రకటించారు.ఏప్రిల్ నెలలో 74.07 లక్షలు, మే నెలలో 74.35 లక్షల కార్డుదారులకు బ్యాంకుల ద్వారా నేరుగా వారి ఖాతాలో ఒక్కొక్క కార్డుపై రూ. 1500 చొప్పున రూ 2,227 కోట్లు, బ్యాంకు ఖాతాలేని వారికి ఏప్రిల్ నెలలో 5.21 లక్షలు, మే నెలలో 5.38 లక్షల మంది కార్డుదారులకు పోస్ట్ ఆఫీసుల ద్వారా మొత్తం రూ 158.24 కోట్లు అందజేయడం జరిగిందని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

 

తాజాగా వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఏప్రిల్ నెలలో రేషన్ తీసుకున్న 2 లక్షల 8 వేల మందికి ఏప్రిల్, మే రెండు నెలలకు కలిపి ఒక్కొక్కరికి రూ. 3000 చొప్పున మొత్తం రూ. 62 కోట్ల 40 లక్షల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని ఆయ‌న తెలిపారు. లబ్దిదారులు భౌతిక దూరాన్ని పాటించి నగదును తీసుకోవాలని చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉచిత బియ్యానికి సంబంధించి ఇప్పటి వరకు (శనివారం, 23వ తేదీ) 81.49 లక్షల (93.10%) మంది కార్డుదారులకు 3 లక్ష 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 5,187 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేయడం జరిగిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: