గోవా...అరేబియా సముద్ర తీరంలో ఉన్న రాష్ట్రం. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో గోవా కలకలలాడేది. కానీ గత మార్చి 24 నుంచి లాక్డౌన్ అమల్లోకి రావడంతో గోవాలో పర్యాటక రంగం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. అయితే ఇప్పుడు గోవాల కరోనా రహిత రాష్ట్రంగా నిలువడంతో ఆ రాష్ట్ర యంత్రాంగం పర్యాటక రంగానికి ద్వారాలు తెరిచింది. ఈ మేరకు గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ శనివారం ఆ రాష్ట్ర పర్యాటక రంగ భవిష్యత్తుపై మాట్లాడారు.
కోవిడ్, గోవాలో భవిష్యత్ టూరిజంపై రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ, గోవాలో మళ్లీ దేశీయ పర్యాటకుల తాకిడి మొదలవుతుందని తెలిపారు. గోవాలో కరోనా వైరస్ కేసులు లేవని, విదేశీ టూరిస్టులు కూడా గోవాకు వస్తారని, కానీ దానికి మరింత సమయం పడుతుందన్నారు. ఇదేమీ దీర్ఘకాలిక నష్టం కాదన్నారు. ‘ప్రస్తుతం గోవా పర్యాటక రంగంలో చోటుచేసుకున్న నష్టం దీర్ఘకాలిక నష్టం కాదు. ఇది పరిస్థితి తాత్కాలికం మాత్రమే. ఇప్పుడు గోవా కరోనా ఫ్రీ రాష్ట్రంగా ఉంది. స్వదేశీ టూరిస్టులు గోవాకు రావచ్చు. అయితే విదేశీ టూరిస్టులు గోవాను సందర్శించడానికి మాత్రం మరికొన్ని రోజులు సమయం పడుతుంది’ అన్నారు.
ఇక జమ్మూకశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో...రాజ్భవన్ను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చానని సత్యపాల్ తెలిపారు. వారానికి ఒకసారి ఫిర్యాదు స్వీకరించేవాళ్లమని అన్నారు. అలా తమ ఆఫీసు సుమారు 95వేల ఫిర్యాదు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. గోవాకు రావడానికి ముందు సుమారు 93 వేల ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదు పరిష్కరించడం వల్ల ప్రజల్లో ఆవేశం తగ్గిందన్నారు. ప్రధాని ఆదేశాల మేరకు కశ్మీర్లో పంచాయతీ ఎన్నికలను నిర్వఘ్నంగా నిర్వహించామన్నారు. ఒమర్, మెహబూబా ముఫ్తీలు ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకించారు, ఉగ్రవాదులు కూడా బెదిరించారు, కానీ తాము విజయవంతంగా ఎన్నికలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు.