ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన జంతువులు గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. సాదు జంతువుల సంగతి పెద్దగా పట్టించుకోకున్నా.. కృరమృగాలు చూసి జనాలు హడలి పోతున్నారు.  ఈ మద్య హైదరాబాద్ లో చిరుత.. ఇటీవల ఓ ఇంట్లోకి చిరుత వచ్చి కుక్కను చంపే ప్రయత్నం చేసింది.. ఇక ఎలుగు బంట్ల గురించి చెప్పనక్కరలేదు.  ఇలా ప్రతిరోజూ ఏదో ఒక జంతువు జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి తండాలోకి రావడం రావడమే స్థానికుడైన బాలరాజు అనే వ్యక్తిపై దాడి చేసింది. దానిని చూసి తండావాసులు ఒక్కసారిగా హడలిపోయారు.  గట్టిగా కేకలు వేస్తూ ఊళ్లోకి ఉరికారు.

 

కొంత మంది వెంటనే అప్రమత్తమై  ఎలుగుబంటిని వెంబడించారు. జనాల్ని చూసి భయపడిన ఎలుగు పక్కనే ఉన్న ఓ బాత్రూంలోకి చొరబడింది. అందరూ కలిసి కర్రలు తీసుకువచ్చి అది బయటకు రాకుండా బాత్రూంకు కర్రలను అడ్డుగా పెట్టారు. వెంటనే అటవీశాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని బంధించేందుకు ప్రయత్నించారు. కానీ అది చిక్కలేదు సరికదా.. మరింత ఉగ్రరూపంగా మారింది..  తప్పించుకునే ప్రయత్నం చేసింది. బాత్రూమ్ తలుపులు ధ్వంసం చేసుకుని నర్సింహులు అనే వ్యక్తిపై దాడి చేసింది.  అప్పటి వరకు ఓపిక పట్టిన జనాలు ఇక కోపం కట్టలు తెంచుకుంది.  

 

కర్రలు ,రాళ్లతో ఎలుగుబంటిని వెంబడిస్తూ దాడి చేశారు. దీంతో ఎలుగుకు తీవ్ర గాయాలు కావడంతో పశువుల ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఎలుగు దాడిలో గాయపడిన స్థానికుల్ని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు. అడవిలో దాని తాలూకు ఎలుగులు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వాటిని వెతికి పట్టుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: