ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సిన్ను కనిపెట్టేందుకు అనేక దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ మహమ్మారి బారి నుంచి మానవాళిని కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయి. తాజాగా.. మానవులపై తొలి దశ క్లినికల్ ట్రయల్స్కు చేరిన మొదటి కొవిడ్-19 వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలిచ్చిందని ప్రముఖ మెడికల్ జర్నల్ ది ల్యాన్సెట్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది. ఈ వ్యాక్సిన్ మనుషుల్లో వైరస్ను సమర్థంగా ఎదుర్కోగలిగే తటస్థ ప్రతిరక్షకాలను విడుదల చేసినట్లు ఆ అధ్యయనంలో వెల్లడించారు. అలాగే వైరస్ను అడ్డుకట్ట వేయడంలో కీలకపాత్ర పోషించే రోగనిరోధక వ్యవస్థలోని టీ-సెల్స్ సమర్థంగా ప్రతిస్పందించాయని చెప్పారు.
తొలిదశలో 108 మందిపై టీకాను ప్రయోగించినట్లు తెలిపారు. టీకా ఇచ్చిన 28 రోజుల తర్వాత వారిలో ఆశాజనక ఫలితాలను గమనించినట్లు పరిశోధకులు చెప్పారు. అయితే, ఈ టీకాపై మరింతగా పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మనుషులను ఈ వైరస్ నుంచి టీకా ఏ మేరకు రక్షించగులుగుతుందో నిర్ధారించడానికి ముందు మరింత లోతైన పరిశోధన జరుగాల్సిన అవసరం ఉందని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్వల్ల రోగనిరోధక వ్యవస్థలో వచ్చిన ప్రతిస్పందనలు కచ్చితంగా మనుషులను కొవిడ్-19 బారి నుంచి బయటపడేస్తాయని కచ్చితంగా చెప్పలేమని వారు పేర్కొన్నారు.
ఈ వ్యాక్సిన్ను 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న 108 మందిపై ప్రయోగించారట. వేర్వేరు మోతాదుల్లో వారికి వ్యాక్సిన్ ఇచ్చారట. అనంతరం తరచూ వారి రక్త నమూనాలను పరిశీలిస్తూ... వైరస్ను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించే ప్రతిరక్షకాలు, టీ-సెల్స్ ప్రతిస్పందన ఎలా ఉందో గమనించారు పరిశోధకులు. అయితే టీకాను తీసుకున్న వారిలో పెద్దగా దుష్స్రభావాలు ఏమీ కనిపించలేదని పరిశోధకులు చెప్పడం గమనార్హం. మరికొన్ని నెలల్లో వ్యాక్సిన్ విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.