హైకోర్టు ఆదేశాల‌తో హైద‌రాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లోని నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కాలుష్య కారక ప్లాస్టిక్‌ పరిశ్రమలపై పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు( పీసీబీ) అధికారులు విరుచుకుప‌డ్డారు. లైసెన్సులు పొందకుండా, పర్యావరణ చట్టాలను పాటించకుండా ఇష్టారాజ్యంగా నడుపుతున్న ప్లాస్టిక్ ప‌రిశ్ర‌మ‌ల‌పై ఉక్కుపాదం మోపారు. నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్న వాటిపై చర్యలు తీసుకున్నారు. ఇలా హైద‌రాబాద్‌ నగరంలోని 66 పరిశ్రమలను మూసివేశారు. ఇవన్నీ కాటేదాన్‌, శాస్త్రి పురం తదితర ప్రాంతాల్లో ఉండగా, ఒకే సారి ఇంత మొత్తంలో పరిశ్రమలను మూసివేయడం సంచలనంగా మారుతోంది.

 

నిజానికి.. పర్యావరణ చట్టాల ప్రకారం ఏ పరిశ్రమ అయినా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ కాటేదాన్‌, శాస్త్రిపురం ప్రాంతాల్లోని ఈ 66 పరిశ్రమలు ఎలాంటి అనుమతులు పొందకుండానే ఏండ్లుగా నడుస్తున్నాయి. శాస్త్రిపురం, కాటేదాన్‌లతో పాటు, బహదూర్‌పురా, మూసీనదిని అనుకున్న ఉన్న ప్రాం తాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ టెక్స్‌టైల్‌, ప్రింటింగ్‌, ఇడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీస్‌, ఆయిల్‌ రిక్లేమేషన్‌ యూనిట్లు, ప్లాస్టిక్‌ స్క్రాప్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు కంపెనీలున్నాయి. వీటి నుంచి నిత్యం విఫరీతంగా కాలుష్యం వెలువడుతున్నది.

 

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ ప్రాంతం 57.73 స్కోర్‌తో పొల్యూటెడ్‌ ఏరియాగా గుర్తింపు పొందడం గ‌మ‌నార్హం. ఈ ప్రాంతాల్లో వెలువడుతున్న కాలుష్యంపై గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కాలుష్య కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఆయా యూనిట్లను మూసివేయాలని ఆదేశాలిచ్చింది. అయితే..  దీనిని పీసీబీ అధికారులు పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ట‌. గత మూడు నెలలుగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా పీసీబీ సభ్యకార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌ రాకతో ప‌రిస్థితి మారిపోయింది. నిబంధ‌న‌లు పాటించ‌ని పరిశ్రమలపై చర్యలు తీసుకున్నారు. ఈ చ‌ర్య‌ల‌పై స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: