ఈ ఏడాది పాలనలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంచలన పథకం.. అమ్మ ఒడి. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్న సమయంలోనే.. ప్రతీ తల్లికి, బిడ్డకూ మేలు చేకూర్చేలా చేస్తానంటూ ఈ పథకాన్ని ప్రకటించారు జగన్. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి... మహిళల ఆదరణ పొందుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో... అమ్మ ఒడి కీలకమైంది, ప్రధానమైంది. ఈ పథకం అమలుపై సీఎం జగన్ పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారు. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తానని చెప్పిన జగన్.. పేదలకు నాణ్యమైన విద్య అందేలా అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. బిడ్డను స్కూలుకు పంపే ప్రతి తల్లీ ఈ పథకానికి అర్హురాలేనంటూ మార్గదర్శకాలు విడుదల చేశారు. తొలి ఏడాదిలోనే ఇంత పెద్ద పథకం చేపడితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు చెప్పినా.. జగన్ వినలేదు. ఎవ్వరి అంచనాలకు అందని విధంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లులకు ఏటా 15వేల రూపాయలను అందివ్వడమే కాకుండా.. ఈ పథకాన్ని ఇంటర్మీడీయట్ చదివే విద్యార్థుల తల్లులకు కూడా వర్తింప చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఈ ఏడాది జనవరి 9న చిత్తూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రారంభించిన అమ్మ ఒడి పథకం.. ప్రతిపక్షాల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నదనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో.. ఈ పథకం అమలు సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పాలి. పాదయాత్రలో పేదవిద్యార్థుల కష్టాలు తెలుసుకున్న జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి పథకం ద్వారా తల్లులకు ఆర్థిక సాయం చేస్తే.. తమ పిల్లలకు చదివించి విద్యావంతులను చేస్తారన్నది సీఎం జగన్ ఆలోచన. అందుకే ఎన్ని ఇబ్బందులైనా ఈ పథకాన్ని అమలు చేసి చూపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి పథకానికి 42 లక్షల 33 వేల 98మంది లబ్ధిదారులున్నారు. ప్రతి తల్లి ఖాతాలో 15 వేల రూాపాయలను జమ చేసింది ప్రభుత్వం. దీనికోసం 6వేల456 కోట్ల రూపాయలు వెచ్చించింది. లబ్దిదారుల జాబితాలో బీసీ వర్గాలకు చెందిన 22 లక్షల 07 వేల 490 మంది, ఓసీ వర్గానికి చెందిన 8 లక్షల 89 వేల 113 మంది, ఎస్సీ వర్గానికి చెందిన 8 లక్షల 59 వేల 4 మంది తల్లులకు ఎస్టీ వర్గానికి చెందిన 2 లక్షల 77 వేల 491 మంది తల్లులకు లబ్ది చేకూరుతోంది.