ఓ వైపు దేశంలోని అనేక రాష్ట్రాలు కరోనా వైరస్తో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అనేక నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. కానీ.. ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ మాత్రం ఇంత వరకూ కరోనా మహమ్మారి జాడ కనిపించలేదు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో కరోనా అడుగుపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కరోనా ఫ్రీ రాష్ట్రంగా ఉంటూ దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడానికి ఆ రాష్ట్రం తీసుకుంటున్న అద్భుతమైన కట్టడి చర్యలే కారణమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. భారత దేశంలో కేసులు వెలుగు చూసిన వెంటనే నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అసోంతో ఉన్న సరిహద్దులను వెంటనే మూసేసింది.
అలాగే, ఇతర రాష్ట్రాలో చిక్కుకున్న నాగాలాండ్ వాసులు తిరిగి రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు అక్కడి నుంచే నగదు ప్రోత్సాహకాలు అందించింది. రాష్ట్రానికి వచ్చేందుకు పేర్లు నమోదు చేసుకున్న 19,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దీంతో వారు ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఇలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఓవైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్నా నాగాలాండ్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే నమ్మడం కష్టంగానే ఉంటుందిగానీ.. నమ్మితీరాల్సిందే మరి.
ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాష్ట్రంలో గత వారం వరకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష కేంద్రం కూడా లేకపోవడం గమనార్హం. నాగాలాండ్తోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో కూడా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదిలా ఉండగా.. భారత్లో ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాజత్, తమిళనాడు, ఢిల్లీ, మధ్య ప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లోనే అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న 11 మున్సిపాలిటీల్లోనే సుమారు 70శాతం కేసులు నమోదు అవుతున్నాయి. ఈ 11 మున్సిపాలిటీలు కూడా ఈ రాష్ట్రాల్లోనే ఉండడం గమనార్హం.