విశాఖ‌లోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ ఘ‌ట‌న‌లో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాస్‌పోర్ట్‌ స్వాధీనపరచాలని కంపెనీ డైరెక్టర్లను ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దంటూ ఆదేశాలిచ్చింది. లాక్‌డౌన్‌ తర్వాత కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు.. ఎవరి పర్మిషన్‌ తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించడం గ‌మ‌నార్హం. ఎల్జీ పాలిమర్స్  కంపెనీ‌ పరిసరాలను సీజ్‌ చేయాలని.. కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరినీ లోనికి అనుమతించకూడదని తెలిపింది. గ్యాస్‌ దుర్ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీలు మాత్రమే ఎల్జీ పాలిమర్స్‌ పరిసరాల్లోకి ప్రవేశించవచ్చని తెలిపింది. ఏం పరిశీలించారో రికార్డు బుక్కుల్లో పేర్కొనాలని చెప్పింది.

 

ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్‌ గ్యాస్‌ను తరలించేందుకు.. ఎవరు అనుమతి ఇచ్చారో కూడా చెప్పాలని హైకోర్టు ఆదేశించడం గ‌మ‌నార్హం. అదేవిధంగా విద్యాసంస్థలు, హాస్పిటల్స్‌, జనావాసాలు ఉన్నచోట... అంత ప్రమాదకరమైన గ్యాస్‌ను అన్ని రోజులు ఎలా నిల్వ‌‌ చేశారని ప్రశ్నించింది. కాగా, ఈ దుర్ఘ‌ట‌న రోజే గ్యాస్‌ లీకేజీ ఘటనను మే 7న సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, డైరెక్టర్లను స్వేచ్ఛగా వదిలేయడం, స్టైరిన్‌ గ్యాస్‌ తరలించేందుకు అనుమతించడంపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారం నాటి విచారణ తర్వాత హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు విడుదల చేసిన విష‌యం తెలిసిందే.

 

హైకోర్టు తాజా ఆదేశాలతో ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటన విషయంలో ఇప్పటి వరకు వెల్లువెత్తుతున్న ప్రశ్నలు సరైనవేనని రుజువైందని న్యాయనిపుణులు అంటున్నారు. కాగా, విశాఖ ఎల్జీపాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘ‌ట‌న‌లో 12 మంది మృతి చెందగా.. వంద‌ల మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆర్ ఆర్ వెంక‌టాపురంతో పాటుగా ఐదుగ్రామాల్లో ఈ ఘ‌ట‌న ప్ర‌భావం ప‌డింది. అయితే.. మృతుల కుటుంబాల‌కు, చికిత్స పొందుతున్న‌వారికి ఏపీ స‌ర్కార్ భారీ మొత్తంలో ఆర్థిక సాయం ప్ర‌క‌టించి, ఇటీవ‌లే అందించింది. ఐదు గ్రామాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచింది. అయితే.. హైకోర్టు తాజా ఆదేశాల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి మ‌రి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: