నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారం క్రమంగా ముదుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఈ విషయంలో సుధాకర్ కులాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో దళిత నేతలతో విమర్శలు చేయిస్తూ రాజకీయంగా లబ్ది పొందాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.
ఈ కేసు విషయమై టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. సుధాకర్ ను మేనేజ్ చేసేందుకు మంత్రి ఆదిమూలం సురేశ్ ప్రయత్నించింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించారు. డాక్టర్ సుధాకర్ ను మేనేజ్ చేయడానికి తాను ప్రయత్నించానంటూ టిడిపి నేత వర్ల రామయ్య చేసిన ఆరోపణను విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ఖండించారు. డాక్టర్ సుధాకర్తో గాని, వాళ్ల అమ్మతో గాని తాను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని, నిరూపించడానికి మీరు సిద్దమా? అని మంత్రి సవాల్ విసిరారు.
అంతే కాదు.. మేనేజ్ అనే పదం టీడీపీకి, ఆ పార్టీ నేతలకు బాగా వర్తిసుందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు. ఎందుకంటే వారు దేనినైనా, ఎవరినైనా మేనేజ్ చేయగలరని విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ విమర్శించారు. వర్ల రామయ్య, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్లను అడ్డుపెట్టుకొని దళితులను రెచ్చ గొట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబుతో దళిత జాతికి క్షమాపణ చెప్పించాలంటూ విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ డిమాండ్ చేశారు.
టీడీపీ ఉడత ఊపులకు భయపడేది లేదన్న మంత్రి సురేశ్.. జగనన్న నాయకత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని, దళిత జాతికి ఏ విధంగా ప్రయోజనాలు అందిస్తున్నారో అందరికీ తెలుసని కామెంట్ చేశారు. మరి ఈ సవాల్ కు టీడీపీ నేతలు ఎలా సమాధానం ఇస్తారో చూడాలి.