జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తులను అమ్మేస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారంపై బదులిస్తూ ఆయన ఈ ఘాటు కామెంట్లు చేశారు. గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచిని సేకరిస్తాం.. చెడును ఉపేక్షించమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు.
"మేం పవన్ కల్యాణ్లా ఫాంహౌస్లో తాగిపడుకోవడం లేదు. దేవాదాయ శాఖ మంత్రి రంజాన్ తోఫా ఎలా పంచుతారని కొందరు అంటున్నారని, మొదట తాను ఎమ్మెల్యేనని, ఆ తరువాతే మంత్రి అని, నియోజకవర్గంలోని అన్ని మతాల వారికి అండగా ఉంటానన్నారు. ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన నాయకుడన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇదే సమయంలో టీడీపీ నేతలపైనా మంత్రి మండిపడ్డారు.
“ టీడీపీ ఐదేళ్ల పాలనపై, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ ఏడాది పాలనపై చర్చకు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ నేతలను మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. ఏడాది పాలనలోనే సీఎం వైయస్ జగన్ అవినీతిని తరిమికొట్టారని గుర్తుచేశారు. అట్టడుగు వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. టీటీడీ ఆస్తులను ప్రభుత్వం అమ్మేస్తుందంటూ తెలుగు దేశం మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే టీటీడీ భూములను అమ్మేందుకు కమిటీ కూడా వేశాడని, ఆ రోజున ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి వెల్లంపల్లి అన్నారు. టీడీపీ హయాంలో టీటీడీ చైర్మన్గా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి, భానుప్రకాష్రెడ్డి సభ్యులుగా ఉన్నప్పుడే టీటీడీలో ఉపయోగం లేని భూములను వేలం వేసేలా కమిటీ వేశారని, గతంలోనే 50 రకాల ఆస్తులను అమ్మాలని గుర్తించారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం టీడీపీ మీడియాకు తప్పుగా కనిపించలేదా..? అని మంత్రి ప్రశ్నించారు. తన పాలనలో ఆలయాలను కూల్చివేసిన నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు.