భారతదేశంలో నమోదు అవుతున్న మొత్తం కేసుల్లో 90శాతం కేసులు కేవలం పదిరాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. ఇదే విషయాన్ని సెంట్రల్ కరోనా టాస్క్ ఫోర్స్ ఎంపవర్డ్ గ్రూప్ 1 చైర్మన్ వీకే పాల్ చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన 1,38,845 కరోనా కేసుల్లో ఎక్కువ భాగం కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో కరోనా తీవ్రత చాలా తక్కువగానే ఉందన్నారు. భారత్లో సరైన సమయంలో లాక్ డౌన్ అమలు చేయడంతో కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా కట్టడి చేయగలిగామని ఆయన అన్నారు. వైరస్ వ్యాప్తి వేగాన్ని కంట్రోల్ చేయడంతో పాటు కొత్త ప్రాంతాలకు వ్యాప్తి కాకుండా ఆపగలిగామని అన్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 73,560పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 70 శాతం కేవలం పది సిటీల్లోనే ఉన్నాయన్నారు. ఇక పది రాష్ట్రాలు కలిపి లెక్కగడితే దేశంలోని 90 శాతం యాక్టివ్ కేసులు తేలాయని, మిగతా దేశమంతా కలిపి 10 శాతం కేసులు ఉన్నాయని వీకే పాల్ చెప్పారు.
దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల్లో 80 శాతం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్లలోనే ఉన్నాయన్నారు. ఇక కరోనాతో సంభవించిన మరణాలు కూడా కొన్ని పరిమిత రాష్ట్రాలు, సిటీల్లోనే ఎక్కువగా నమోదైనట్లు వీకే పాల్ తెలిపారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 6977 కొత్త కేసులు నమోదయ్యాయి. 154 మంది మరణించారు. సోమవారం ఉదయం 9 గంటల నాటికి దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,845 కు చేరుకుంది. 77103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్ బారి నుంచి 57,720 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4021మంది మరణించారు. రోజురోజుకూ కేసుల సంఖ్య ఈ స్థాయిలో పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్, పశ్చిమబెంగాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.