కరోనా సంక్షోభం కారణంగా భారీ కంపెనీలు సైతం విలవిలలాడుతున్నాయి. అయితే.. టాటా గ్రూపు చరిత్రలోనే టాప్ మేనేజ్ మెంట్ తొలిసారి సంచలన నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహా, టాటా గ్రూప్ కంపెనీల సీఈఓలు తమ వేతనంలో కోత విధించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఖర్చు తగ్గించే చర్యలను ప్రారంభించిన నేపథ్యంలో 20 శాతం దాకా వేతన కోతకు సిద్ధమయ్యారు. కరోనా వైరస్ , లాక్డౌన్ కారణంగా వ్యాపారం తీవ్రస్థాయిలో ప్రభావితం కావడంతో సంస్థ ఈ నిర్ణయం వెలువడింది.
తాజా నిర్ణయం ప్రకారం... టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, టాటా క్యాపిటల్, వోల్టాస్ ఇతర కంపెనీల సీఈవోలు, ఎండీలు వారి వారి జీతాలను తగ్గించు కుంటారన్నమాట. అలాగే ప్రస్తుత సంవత్సర బోనస్లను కూడా వదులుకోనున్నారు. ఈ వరుసలో గ్రూప్ ప్రధానమైన, అత్యంత లాభదాయక సంస్థ టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ ముందు వరుసలో నిలిచారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2019-20లో రాజేష్ రెమ్యునరేషన్ 16.5 శాతం తగ్గి రూ .13.3 కోట్లకు చేరుకుంది. తద్వారా సంస్థలకు, కీలక ఉద్యోగులకు ప్రేరణ ఇవ్వడంతోపాటు, నైతిక మద్దతు అందించాలని భావిస్తున్నారు. కరోనా వైరస్ ప్రేరిత సంక్షోభం సమయంలో పే-కట్ తీసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఇదేనని కంపెనీ వెల్లడించింది.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 2020 ఆర్థిక సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ వేతనాలు భారీగా క్షీణించాయి. టాప్15 టాటా గ్రూప్ కంపెనీలలో సీఈవో వేతనం ఎఫ్వై18 పోలిస్తే...ఎఫ్వై 19లో సగటున 11 శాతం పెరిగింది. ఎఫ్వై 17 తో పోలిస్తే ఎఫ్వై 18 లో 14 శాతం పెరగడం గమనార్హం. టాటా గ్రూప్ చరిత్రలోనే మొదటిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ఆసక్తికరమైన చర్చజరుగుతోంది.