క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో చైనా చుట్టూ అనేక వివాదాలు చుట్టుకుంటున్నాయి. క‌రోనా వైర‌స్‌ను సృష్టించింది చైనాయేన‌ని అంత‌ర్జాతీయంగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌పంచంలోనే శ‌క్తిమంత‌మైన ఆర్థిక దేశంగా ఎదిగేందుకు చైనా ఈ క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించింద‌నే వాద‌న రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంది. ఇక అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే.. ప‌దేపదే ఇదే ఆరోప‌ణ చేస్తున్నారు. తాజాగా.. చైనాపై మ‌రో ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి.  దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా కరోనా వైరస్‌ వ్యాప్తిని ఉపయోగిస్తుందనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ ఆరోప‌ణ‌ల‌ను చైనా కొట్టిపారేసింది. ఆ ఆరోపణలు పూర్తిగా అర్థం లేనివని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ తెలిపారు. దక్షిణ చైనా సముద్రంలో సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం.. చైనా కరోనా వ్యాప్తిని విస్తరిస్తుందనడంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

 

వైరస్‌ నిరోధానికి సంబంధించి చైనా.. ఆగ్నేయ ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తోంద‌ని చెప్పారు. అయితే కొందరు మాత్రం చైనాపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిప్డారు. మిలటరీ విమానాలు మోహరించడం, సముద్రంలో గస్తీ నిర్వహించడంతో అస్థిరత సృష్టించేందకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని అమెరికా దాని మిత్రదేశాలను ఉద్దేశించి ఆయ‌న అన్నారు.  చైనా, ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య వివాదాలు రేకెత్తించడం కోసమే ఇటువంటి నీచమైన ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి.. దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంద‌నే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

 

అంతేగాకుండా.. ఈ వివాదాస్పద ప్రాంతం నౌకల రవాణాకు కీలకమైనది కూడా. ఈ ప్రాంతం మీద అధిపత్యం కోసం చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, తైవాన్‌, బ్రూనై దేశాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. ఆ ఆరోప‌ణ‌లను ఖండించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: