దేశంలో గత రెండు నెలల నుంచి కరోనా మహమ్మారి మెల్లి మెల్లిగా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రా, గుజరాత్, తమిళనాడు లో ఈ కేసులు, మరణాల సంఖ్య భారీగానే పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా 6,000పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 6,977 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 154 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 1,38,845కి చేరగా, మృతుల సంఖ్య 4,021కి చేరుకుంది. 77,103 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కరోనా నుంచి ఇప్పటివరకు 57,720 మంది కోలుకున్నారు.
ఇక కర్ణాటకలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తగా 69 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో కర్ణాటకలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,158కి చేరింది. సోమవారం కొత్తగా మరో కరోనా బాధితుడు మృతిచెందడంతో కర్ణాటకలో మొత్తం మరణాల సంఖ్య 43కు చేరింది. కాకపోతే ఇక్కడ ఇద్దరు కరోనా బాధితులు మాత్రం ఇతర కారణాల వల్ల మరణించినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇక కర్ణాటకలో నమోదైన మొత్తం కేసులలో ఇప్పటివరకు 680 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా 1433 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఇటీవల లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు చేసినప్పటి నుంచి ఈ కేసులు ఉధృతం అవుతున్నాయని.. వలస కార్మికులు ఎప్పుడైతే స్వస్థలాలకు వస్తున్నారో కేసులు సంఖ్య పెరుగుతున్నాయని అంటున్నారు. మరోవైపు కేసులు పెరగకుండా అదుపులోకి తెచ్చేందుకు లాక్ డౌన్ పటిష్టం చేస్తామని అంటున్నారు అధికారులు.