ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ గత రెండు, మూడేళ్లుగా రాజకీయంగా ఎంతో సఖ్యతతో ఉంటోన్న విషయం తెలిసిందే. అసలు ఎక్కడా కూడా వీరిద్దరి మధ్య చిన్న పొరా పొచ్చలు కూడా రాలేదు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే శ్రీశైలం నీటి మళ్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వ జీవో జారీ చేశాక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిన్న గ్యాప్ మొదలైందా ? అన్న సందేహాలు చాలా మందిలో కలిగాయి. జగన్ ఈ విషయంలో మంకు పట్టుతో ముందుకు వెళుతున్నాడంటూ కొందరు చర్చించారు. అటు సీఎం కేసీఆర్ సైతం జగన్ కు పోటీగా జురాల దగ్గర మరో ప్రాజెక్టు.. ఇక్కడ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కట్టేస్తున్నాడంటూ మరి కొందరు అనుకున్నారు. సరే ఎవరేమనుకున్నా సీఎం కేసీఆర్ మాత్రం ప్రెస్ మీట్లో మాకు మాకు గొడవలేం లేవు.. మేం బాగానే ఉన్నాం అని చెప్పి కాస్త షాక్ ఇచ్చారు.
కేసీఆర్ ఈ మాట చెప్పినా జగన్ తీసుకున్న నిర్ణయం అటు తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైనా రుచించ లేదనే చెప్పాలి. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే గోదావరి లో మిగులు నీళ్లు ఎక్కువ అందుకని.. గోదావరి నీళ్లు ఏపీ ఎక్కువుగా వాడుకోవాలని.. అలా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని చెపుతున్నారు. ఇటు జగన్ మాత్రం పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వీలైనంత ఎక్కువ నీళ్లు తరలించి సీమను అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సరే ఏదెలా ఉన్నా రెండు రాష్ట్రాల మధ్య ఈ చిన్న పాటి పొరాపొచ్చలు కూడా ఉండకూడదని వైసీపీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ క్రమంలోనే జగన్కు అత్యంత సన్నిహితుడు అయిన సీమ జిల్లాలకు చెందిన ఓ మంత్రి కేసీఆర్, జగన్ మధ్య వ్యూహాత్మకంగా సయోధ్య కోసం రంగంలోకి దిగినట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సదరు మంత్రి తెలంగాణలో కూడా భారీ ఎత్తున కాంట్రాక్టులు చేస్తున్నారు. దీంతో ఆయనే చొరవ తీసుకుని చిన్న గ్యాప్ కూడా లేకుండా చేయాలని చూస్తున్నారట.