ఏపీలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఏపీ మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును ప్రతిపక్ష హోదాను గల్లంతు చేసేందుకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీకి డబుల్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. తాజా సమాచారం ప్రకారం.. ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీ గూటికి చేరగా.. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి బిగ్ షాక్ ఇవ్వనున్నారు. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారు.
ఇందులో భాగంగా నేటి సాయంత్రం వీరిద్దరూ సీఎం జగన్ను కలవనున్నారు. మరియు ఈ సాయంత్రమే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ వైసీపీ కండువ కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి సత్యప్రసాద్ సోదరి డాక్టర్ కావటం, జగన్ సతీమణికి ఫ్రెండ్ కావటంతో ఆ పరిచయాల ద్వారా సత్యప్రసాద్ వైసీపీలోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సైతం సొంత జిల్లాకు చెందిన మంత్రి బాలినేని తో మంతనాలు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేరేందుకు ఒప్పించారు. మరియు ప్రకాశం జిల్లాకు చెందిన మరో యువ ఎమ్మెల్యే సైతం టీడీపీకి దూరం అవ్వాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
కాగా, 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆ 23 మంది శాసనసభ్యుల్లో కనీసం ఆరేడుగురిని ఆ పార్టీకి దూరం చేసి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని బాలశౌరి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సీఎంతో భేటీ అయ్యారు. వారు పార్టీ మారుతున్నట్లు అధికారికంగా ప్రకటించకపోయినా.. సీఎం నిర్ణయాలకు మద్దతుగా నిలిచారు. ఇక మరింత మంది తెలుగుదేశం పార్టీని వీడితే భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా గల్లంతవుతోంది. ఈ క్రమంలోనే భారీ వ్యూహంతో ఏపీలో అధికార వైసీపీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపినట్టు తెలుస్తోంది.