కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ఈ పేరు వింటేనే ప్రపంచదేశాల ప్రజలు వణికిపోతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచదేశాలు విస్తరించి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కంటికి కనిపించని కరోనా వైరస్ ఈజీగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి.. నానా ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే స్తంభించిపోయింది. శతాబ్ధకాలంగా ఎప్పుడూ ప్రపంచం ఎదుర్కోని పరిస్థితులు ఎదుర్కొంటుంది మానవాళి. ఇక ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 55 లక్షల పాజిటివ్ కేసులు దాటగా.. ఉండగా కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3.50 లక్షలు మించిపోయింది.
ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. అయితే ఇలాంటి విపత్కర సమయంలో కరోనా కారణంగా నమోదవుతున్న వేలాది మరణాలను నిరోధించగలిగే అతి చవకైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఆర్థరైటిస్ డ్రగ్ ను ట్రయల్స్ కోసం పరిశీలించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిర్ణయించింది. కరోనా మరణాలకు కారణంగా భావిస్తున్న సైటోకిన్ తీవ్రతను ఎదుర్కొనేందుకు యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఆర్థరైటిస్ డ్రగ్..ఇండోమెథాసిన్ యూజ్ అవుతుందని చెన్నైకి చెందిన డాక్టర్ రాజన్ రవిచంద్రన్ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి రోగుల్లో సైటోకిన్ తీవ్ర ప్రభావాన్ని ఆపడానికి ఇండోమెథాసిన్ ఉపయోగించి సఫలమైనట్టు రవి చంద్రన్ తెలిపారు.
కరోనా బాధితులపై దీనిని ఔషధంగా ఉపయోగించవచ్చని రవిచంద్రన్ సూచించారు. అయితే ఆశాజనక ఫలితాలకు పెద్ద ఎత్తున నిర్వహించే మెడికల్ ట్రయిల్స్ కీలకమన్నారు. అంతేకాదు, ఇండోమెథాసిన్ క్యాప్సూల్ ధర కేవలం రూ.5 మాత్రమే. కానీ, కరోనా రోగుల్లో ఇప్పుడు ఉపయోగించే టోసిలిజుమాబ్ఒ క మోతాదు ధర రూ. 60 వేలు ఖర్చు అవుతుంది. దీనిని బట్టీ అతి తక్కువ ధరకే ఇండోమెథాసిన్ క్యాప్సూల్ లభిస్తున్నట్టు అవుతుంది. ఈ క్రమంలోనే ఆయన ట్రయల్స్ కోసం తన ప్రతిపాదనలను ఐసీఎంఆర్ తోపాటు, అమెరికా, కెనడా దేశాలకు ఏప్రిల్ 29 న పంపించారు. దీనిపై యూకే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ స్పందిస్తూ.. వీటిని తమ చికిత్సా టాస్క్ ఫోర్స్ కు పంపించినట్టు స్పష్టం చేసింది. ఏదేమైనా ఈ కరోనా కష్టకాలంలో ఇండోమెథాసిన్ క్యాప్సూల్ మన ముందున్న దివ్య ఔషధంగా కనిపిస్తోందని చెప్పాలి.