వివాదాలకు కేరాఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఎవరితోనైనా పేచీ పెట్టుకోవడంలో ముందుంటారు. ఇక అమెరికా మీడియాతో ట్రంప్ కు ఎప్పుడూ వివాదమే. తన ట్విట్టర్ వేదికగా యూఎస్ మీడియాపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ తోనూ గొడవేసుకున్నారు ట్రంప్.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైరయ్యారు. తన అభిప్రాయాలు, భావాలను వ్యక్తపరుస్తూ ఎప్పుడు యాక్టీవ్గా ఉండే సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్తోనే పేచీ పెట్టుకున్నారు. ట్రంప్ చేసిన ఓ ట్వీట్కు... ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని ట్విట్టర్ సూచించడంతో ఉడికిపోతున్నారు. ఒక దేశాధ్యక్షుడికి ట్విట్టర్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి. అది క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పడంతో అవమానంగా ఫీలవుతున్నారు ట్రంప్.
అసలేం జరిగిందంటే...నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో మెయిల్ ఇన్ బ్యాలెట్ విధానాన్ని అవలంభించాలని కాలిఫోర్నియా గవర్నర్ నిర్ణయించారు. ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రర్ చేసుకున్నవారికి ఇప్పటి నుంచే బ్యాలెట్ బాక్సులు పంపాలని ఆదేశించారు. దీన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోకుండా బ్యాలెట్ బ్యాక్సులు పంపుతున్నారని ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఓటు వేయనివారు కూడా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని, రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ట్విట్టర్... ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
మెయిల్ ఇన్ ఓటింగ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన రెండు ట్వీట్లు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ట్విటర్ నిజ నిర్థారణ చేసింది. మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా రిగ్గింగ్కు ఆస్కారం ఉందంటూ ప్రెసిడెంట్ ట్రంప్ తప్పుడు ప్రకటనలు చేశారు. ఏది ఎమైనప్పటికి మెయిల్ ఇన్ ఓటింగ్ ద్వారా ఓటర్లు మోసాలకు పాల్పడే అవకాశం లేదని మా నిజ నిర్థారణ నిపుణులు తేల్చారని ట్విట్టర్ పేర్కొంది. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్విటర్ జోక్యం చేసుకుంటోంది. మెయిల్ ఇన్ ఓటింగ్పై నేను చేసిన వ్యాఖ్యలు అవినీతి, మోసాలకు ఆస్కారమిస్తాయని అంటోంది. అది ముమ్మాటికీ తప్పేనని విరుచుకుపడ్డారు అమెరికా ప్రెసిడెంట్.