రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ తెలుగు గడ్డను పరిపాలించినా వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన వారిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు... ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రథమ వరుసలో ఉంటారు. ఇక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ తో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సైతం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు దేశ చరిత్రలో జరిగిన విధంగా సరికొత్త విప్లవాత్మక మార్పుల తో ముందుకు వస్తోంది.
ఈ క్రమంలోనే ఓ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలు అక్కడే సమకూర్చే ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం రైతులు పంటలు పండించి అమ్ముకునేందుకు పడుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు పంట నాటిన దగ్గర నుంచి పంట పండించడం ఆ తర్వాత పంట చేతికి రావడం పంట అమ్ముకునే వరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ టైంలో దళారీ వ్యవస్థ ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే రైతు దోపిడీకి గురికాకుండా ఉండేందుకు జగన్ ఎన్నో మార్పులు తీసుకు వస్తున్నారు.
రైతులు పండించే ఉత్పత్తులు అన్ని జనతా బజార్లలో ఉంటాయి. ఇవి ప్రతి గ్రామంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నేరుగా రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేస్తే ఆ వెంటనే దళారీల దోపిడి తగ్గుముఖం పడుతుంది. ఇక దీనిపై అధ్యయనం చేసిన వెంటనే వచ్చే యేడాదిలో జనతా బజార్లను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఇక జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబులతో పాటు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు.. రైతులకు రుణాలు, గిట్టుబాటు ధరలు ఇలా వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు తీసుకు వచ్చేందుకు జగన్ ప్రభుత్వం పక్కా ప్లానింగ్తో ముందుకు వెళుతోంది. జగన్ ఫాలో అవుతోన్న విధానాన్ని ఇప్పుడు కేంద్రం నిశితంగా గమనిస్తుండగా.. ఏపీ బీజేపీ వాళ్లు సైతం పైకి మెచ్చుకోకపోయినా అంతర్గత సంభాషణల్లో ప్రశంసిస్తున్నారట.