డ్రాగన్ కంట్రీ చైనాకు ఆదిపత్య పోకడలు తగ్గడం లేదు. కమ్యూనిస్టు పాలన, సిద్ధాంతాలు అంటూ నీతులు వల్లిస్తున్నప్పటికీ ఇతరులపై పైచేయి సాధించాలనే పోకడలు పక్కనపెట్టడం లేదు. ప్రపంచ పెద్దన్నగా గుర్తింపు పొందాలనే కాంక్షతో కరోనాను సృష్టించిందనే ఆరోపణలు ఎదుర్కుంటున్న డ్రాగన్ కంట్రీ తాజాగా మరో పాపపు ఎత్తుగడకు పాల్పడింది. హాంగ్కాంగ్ దేశంపై దురాక్రమణకు పాల్పడింది. హాంగ్కాంగ్లో ఉగ్రవాదాన్ని నిరోధించాలన్న ఉద్దేశంతో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకున్న ఆ దేశం అందులో పేర్కొన్నవన్నీ దుర్మార్గపు అంశాలే.
వివరాల్లోకి వెళితే... `హాంగ్కాంగ్ సెక్యూర్టీ బిల్లు`పేరుతో చైనా పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. ఇందులో 2878 మంది అనుకూలంగా ఓటేశారు. దీంతో చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపినట్లయింది. ఈ బిల్లు పాస్ కావడంతో హాంగ్ కాంగ్ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుంది. ఈ బిల్లు ప్రకారం, ఇక నుంచి హాంగ్కాంగ్లో ఆ దేశ సెక్యూర్టీ దళాలు పనిచేయనున్నాయి. ఎవరైనా చైనా ఆదేశాలను వ్యతిరేకిస్తే, కొత్త బిల్లు ప్రకారం వారు శిక్షార్హులు అవుతారు. ఇంతటి దుర్మార్గపు బిల్లును చైనాలో ఆమోదించడం పట్ల హాంగ్కాంగ్లో నిరసనలు వెల్లువెత్తాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఇవాళ హాంగ్కాంగ్లో హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. ఇప్పటి వరకు విశిష్ట హోదాను అనుభవించిన హాంగ్కాంగ్కు తాజా బిల్లుతో ఆ దశ మారే ప్రమాదం ఉన్నది.
కాగా, చైనా పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది నుంచి హాంగ్కాంగ్లో భారీ నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ, చైనా ఈ వివాదాస్పద చట్టాన్ని రూపొందించడానికి ముందే, చైనా కమ్యూనిస్టు పార్టీ దీనిపై తీర్మానం చేసింది. ఆ చట్టం వల్ల హాంగ్ కాంగ్ స్వేచ్ఛకు భారీ విఘాతం కలగనుందని, హాంగ్కాంగ్ ప్రతిపత్తిపై ఇది దాడి అని ఆరోపణలు వచ్చాయి. కాగా, హాంగ్కాంగ్లో జాతీయ భద్రతను పెంచేందుకు అవసరమైన చట్టాలను రూపొందిస్తున్నట్లు చైనా ప్రధాని లీ కీక్వాంగ్ తెలిపారు. కాగా అయితే తమ స్వేచ్ఛకు భంగం కలగకుండా చైనాకు సహకరించనున్నట్లు హాంగ్ కాంగ్ చెప్పింది. చైనా రూపొందించిన కొత్త చట్టం వల్ల మార్కెట్లు పతనమైనట్లు తెలుస్తోంది.