తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకింత ఆలోచనలో పడాల్సిన పరిస్థితి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను తన రాజకీయ ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇప్పుడు వీరిపై కొత్త స్కెచ్ను అమల్లో పెట్టారా? కీలకమైన అంశంలో, ప్రజల సెంటిమెంట్తో దెబ్బ కొట్టేందుకు నూతన అస్త్రం తెరమీదకు తెచ్చారా? అనే చర్చ ప్రస్తుత రాజకీయవర్గాల్లో సాగుతోంది. చంద్రబాబు తెరమీదకు తెచ్చిన ఆ కొత్త అస్త్రమే ఆయన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
నందమూరి బాలకృష్ణ ఒకే రోజు, రెండు వేదికల ద్వారా చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సినీ ప్రముఖుల్లో ఒకరైన బాలకృష్ణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ, టాలీవుడ్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ కారణంగా సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాపోయారు. సినీ కార్మికులు అనేక కష్టాలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వంతో సినిమా పెద్దలు సంప్రదింపులు చేస్తున్న విషయం తనకు తెలియదని పేర్కొన్న బాలకృష్ణ తాను కూడా అందరిలానే పేపర్లో మీడియాలో చూశానని తెలిపారు. సినీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరిన బాలకృష్ణ సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని అన్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ అంతర్గత కార్యక్రమమైన మహానాడులో మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు ముందే, ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క చాన్స్ తనకు ఇవ్వాలని కోరిన జగన్ సరైన పాలన అందించడంలో వైఫల్యం చెందారని మండిపడ్డారు. అధికార వైసీపీని ఎదుర్కునేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు. టీడీపీ నేతలతో నిర్వహించిన జూమ్ మహానాడులో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఇటు ఏపీలో అటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ క్రమంలో బాలయ్యను రంగంలోకి దింపారా? అనే చర్చ జరుగుతోంది. గత కొద్దికాలంగా మీడియాకు దూరంగా ఉన్న బాలకృష్ణ ఒక్కరోజే ఇద్దరు సీఎంలపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది.