కొన్ని సంఘటనలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? అనే ఆశ్చర్య సైతం కలుగుతుంది. కానీ జరుగుతాయని కొన్నింటినీ చూస్తే స్పష్టమవుతుందిఓ. కరోనా కలకలం నేపథ్యంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఆశ్చర్యకర ఉదంతాల్లో తాజా షాకింగ్ ఘటన ఇది. జనంలోకి వెళ్తే కరోనా వైరస్ ఎక్కడ అంటుకుంటుందోనన్న భయంతో తన కూతురి కోసం ఏకంగా 180 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న విమానాన్ని బుక్ చేశాడో తండ్రి.
గత సోమవారం నుంచి దేశవ్యాప్తంగా విమానాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయినా సరే.. జనం మధ్యలో ప్రయాణం చేస్తే కరోనా సోకే ముప్పు ఉందన్న భయంతో ఒక ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా భోపాల్ లో చిక్కుకుపోయిన తన కుమార్తె, ఆమె ఇద్దరు బిడ్డలు, ఒక పనిమనిషిని ఢిల్లీ పంపడం కోసం దాదాపు రూ.20 లక్షలు ఖర్చు పెట్టాడు. తన ఇంటికి వచ్చిన కుమార్తెను సురక్షితంగా పంపడం కోసం ఇలా మొత్తం ఫ్లైట్ నే బుక్ చేసుకున్న ఆ అపర కుబేరుడు భోపాల్ కు చెందిన ఓ లిక్కర్ వ్యాపారి అని తేలింది.
మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, భోపాల్ కు చెందిన మద్యం వ్యాపారి కుమార్తె, ఇద్దరు మనవరాళ్లు లాక్ డౌన్ కు ముందు ఢిల్లీ నుంచి భోపాల్ వచ్చి చిక్కుకుపోయారు. అయితే ట్రైన్లు, ఫ్లైట్లు స్టార్ట్ అయినప్పటికీ పది మంది మధ్యలోకి వెళ్లి క్యూలు పాటిస్తూ అందరి మధ్య కూర్చుని ప్రయాణిస్తే కరోనా వైరస్ బారినపడే ప్రమాదం ఉందని ఆ లిక్కర్ బ్యారన్ ఏకంగా ఎయిర్ బస్ A320ని బుక్ చేశాడు. 180 మంది కూర్చునిప్రయాణించగలిగే ఆ విమానం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి సోమవారం నాడు భోపాల్ చేరుకుంది. అక్కడి నుంచి ఆ వ్యాపారి కుమార్తె, మనవరాళ్లు, ఒక పని మనిషి… మొత్తం నలుగురితోనే తిరుగు ప్రయాణమై వారిని ఇంటికి చేర్చింది. ఎయిర్ బస్ A320 విమానాన్ని ప్రత్యేకంగా కిరాయికి తీసుకునేందుకు సుమారు రూ.20 లక్షలు అవుతుందని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ బడాబాబు వివరాలు వివరాలు చెప్పేందుకు ఎయిర్ పోర్టు అధికారులు నో చెప్పడం కొసమెరుపు.