ఏపీ సీఎం జగన్.. పరిశ్రమల విషయంలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో తన ప్రభుత్వం చేపట్టబోయే కీలకమైన ప్రాజెక్టుల వివరాలు వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించి మూడేళ్లలో చేయబోయే ప్రాజెక్టులను గుర్తించామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. కచ్చితంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులేంటని ఆలోచన చేస్తే.. రామయపట్నం, మచిలీపట్నం, బావనపాడులో గ్రీన్ఫీల్డ్ పోర్టులు ఏర్పాటు చేయనున్నామన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇవేకాకుండా స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు నిర్మింస్తామని సీఎం జగన్ ప్రకటించారు. వీటితో పాటు కడపలో రూ.15 వేల కోట్లతో రెండున్నర మిలియన్ టన్నుల ఉత్పత్తితో కూడిన స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని.. ఎవరైనా పారిశ్రామిక వేత్త ఆసక్తి చూపితే ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందంతో నిర్మాణం చేపట్టేందుకైనా.. లేక వారికి నిర్మాణ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఈ పరిశ్రమ కోసం రా మెటీరియల్కు సంబంధించి ఎన్ఎండీసీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించిన జగన్... డీఆర్డీఓ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిస్టిట్యూషన్తో స్టీల్ సప్లయ్ చేసే పరిస్థితిలోకి ఒప్పందం చేసుకుంటున్నామని వివరించారు. పరిశ్రమలు పెట్టే వారికి భూమి పరంగా, నీరు పరంగా, విద్యుత్ పరంగా, అతిముఖ్యమైన స్కిల్డ్ వర్క్ఫోర్స్ను అందించగలమని జగన్ భరోసా ఇచ్చారు.
పరిశ్రమలకు స్కిల్డ్ వర్క్ఫోర్స్ తీసుకువచ్చేందుకు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు తీసుకురాబోతున్నామని.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయడమే కాకుండా మరో ఐదు కాలేజీలు అదనంగా మొత్తం 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు తీసుకువస్తున్నామని జగన్ తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పేశారు.