ప్రస్తుతం టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు జూమ్ వెబినెయిర్ ద్వారా ఘనంగా జరుగుతోంది. దాదాపు నెల రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నాయకులకు ఆన్ లైన్లోనే ఆహ్వానాలు అందించారు. గుంటూరు, కృష్ణా నేతలను నేరుగా కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇక, జిల్లా వ్యాప్తంగా నాయకులను ఆన్లైన్లో పాల్గొనే లా చేశారు. నిజానికి మూడు రోజులు నిర్వహించే కార్యక్రమాన్ని ఈ దఫా రెండు రోజులకు మాత్రమే పరిమితం చేశారు. మే 27, 28, 29 రోజులు ఘనంగా నిర్వహించే సంప్రదాయం టీడీపీలో ఉంది.
పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మూడు రోజులు నిర్వహించేవారు. అయితే, ఇప్పుడు అధికారం కో ల్పోయిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడం, అందునా గత ఏడాది నిర్వహించక పోవడం వంటి కారణాలతో దీనికి ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరు కీలక నాయకులు జిల్లాలు దాటి మరీ వచ్చి మంగళగిరిలోని ప్రధాన పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, గుంటూరులోనే కీలక నాయకుడిగా ఉన్న దాదాపు పార్టీ పెట్టినప్పటి నుంచి వరుసగా విజయాలు సాధిస్తున్న కుటుంబం ధూళిపాళ్ల ఫ్యామిలీ. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి ఈ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తోంది.
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వరుసగా ఐదు సార్లు గెలిచారు. గత ఏడాది ఎన్నికల్లో అత్యంత స్వల్ప మెజా రిటీతోనే ఆయన ఓటమిపాలయ్యారు. అలాంటి నాయకుడు ఇప్పుడు పక్కనే ఉన్నప్పటికీ.. మహానాడుకు హాజరుకాలేదు. పోనీ ఇంటి పట్టునే ఉండి ఈ కార్యక్రమానికి ఏమైనా హాజరయ్యారా? అంటే.. అది కూడా ఎక్కడా లేదు. ఆయన ఊసు ఎక్కడా మహానాడులో వినిపించడం లేదు కనిపించడం లేదు. కృష్ణా గుం టూరు జిల్లాలకు చెందిన చంద్రబాబు సామాజిక వర్గం నేతలను వైసీపీ కంట్రోల్ చేస్తోందనే వార్తలు విని పిస్తున్న నేపథ్యంలో ధూళిపాళ్ల రాకపోవడం, మహానాడులో పాల్గొనక పోవడం వంటి చర్చకు వస్తున్నాయి.
కొన్నాళ్లుగా ఆయన సైలెంట్గా ఉంటున్న విషయం తెలిసిందే. పార్టీలోనే ఉన్నప్పటికీ.. పార్టీ వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. పైగా స్థానిక ఎమ్మెల్యే రోశయ్యతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా మహానాడులో ఆయన పాత్ర కూడా కనిపించడం లేదు. ఈ పరిణామాలతో ఆయన కూడా పార్టీకి దూరమయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారా? లేక వైసీపీకి అనుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అనే చర్చ ఆసక్తిగా మారింది. మరి ఏం చేస్తారో చూడాలి.