వలస కూలీల ఇబ్బందులపై సుప్రీం కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలిచ్చింది. కూలీల ప్రయాణానికి సంబంధించి రవాణా ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. వారిని గుర్తించి, సదుపాయాలు కల్పించాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయాలని తేల్చిచెప్పింది.

 

వలస కూలీల కష్టాలు, ఇబ్బందులను సుమోటోగా తీసుకొని విచారణ జరిపింది సుప్రీంకోర్టు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక లోపాలు తమ దృష్టికి వచ్చాయని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. రవాణా కోసం రిజిస్ట్రేషన్‌, భోజన సదుపాయం, రైళ్ల కోసం ఎదురు చూడడం లాంటి  సమస్యలు గుర్తించామంది. వారి కష్టాలు చూసి కొన్ని మధ్యంతర ఆదేశాలు ఇస్తున్నామని తెలిపింది. వలస కూలీల నుంచి బస్సు, రైలు ప్రయాణానికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. వారిని గుర్తించడం, వారికి సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేసింది. 

 

రైలు ఎక్కే వరకు అక్కడి రాష్ట్రం, ఎక్కిన తర్వాత రైల్వే శాఖ, చేరుకున్న తర్వాత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం... వలస కూలీలకు భోజన సదుపాయం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వలస కూలీల నమోదు చర్యను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. సహాయ కేంద్రాల ద్వారా త్వరగా స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయం కల్పించాలంది. ఈ విషయాలు వలస కూలీలకు చేరేలా ప్రచారం చేయాలని సూచించింది. నడిచి వెళ్తున్న కూలీలు కనిపిస్తే వెంటనే వారిని శిబిరాలకు తరలించి సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.

 

రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ల కోసం విజ్ఞప్తి చేస్తే, రైల్వే శాఖ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో తెలిపింది. ఎంత మంది కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు? వారి రవాణా ప్రణాళిక, రిజిస్ట్రేషన్‌ విధానాలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 5కు వాయిదా వేసింది.

 

వలస కూలీల తరలింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని,  రైళ్ల ద్వారా 50 లక్షల మందిని, రోడ్డు మార్గంలో మరో 47 లక్షల మందిని తరలించామని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు చెప్పారు. రవాణా ఖర్చుల విషయంలో రైల్వే ఛార్జీలను రాష్ట్రాలు భరించాయని, కొన్ని సందర్భాల్లో రీయింబర్స్‌ చేసినట్లు తెలిపారు. రైళ్లలో ఉచితంగా భోజనం అందించామని చెప్పారు. మొత్తం వలస కార్మికుల్ని తరలించేందుకు ఎంత సమయం పడుతుందని ఎస్‌జీని ధర్మాసనం ప్రశ్నించగా.. రాష్ట్రాలు నివేదిక సమర్పించాక అవగాహన వస్తుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: