అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊహించని షాక్ తగిలింది. తన సంచలన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ట్రంప్ తాజాగా మరో ఇబ్బందికరమైన పరిస్థితితో తెరకెక్కారు. అమెరికాలోని మిన్నియాపోలిస్లో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయ వ్యక్తిని ఓ శ్వేతజాతి పోలీసు గొంతు నొక్కి చంపిన విషయం తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి అమెరికా దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు వాషింగ్టన్ డీసీలో భారీ స్థాయిలో సాగాయి. అధ్యక్ష అధికార భవనం శ్వేత సౌధం వద్ద కూడా నిరసనలు హోరెత్తాయి, దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ట్రంప్ ప్రాణాలు కాపాడేందుకు వారు బంకర్లను ఉపయోగించారు.
నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ను పోలీసులు చంపిన కేసులో దావానలంలా ఆందోళనలు హోరెత్తడంతో.. వైట్హౌజ్లో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను.. ఆ నివాసంలో ఉన్న అండర్గ్రౌండ్ బంకర్లోకి తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం వందల సంఖ్యలో ఆందోళనకారులు వైట్హౌజ్ను చుట్టుముట్టారు. సీక్రెట్ సర్వీస్, యూఎస్ పార్క్ పోలీసు ఆఫీసర్లు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. శ్వేతసౌధం వద్ద జరిగిన నిరసనలను ఉధృతిని చూసి అధికారులు షాకయ్యారు. అమెరికాకు చెందిన ప్రముఖ దినపత్రిక ద న్యూయార్క్ టైమ్స్ ఈ మేరకు ఓ సంచలన కథనం రాసింది. బంకర్లో దాగిన ట్రంప్.. సుమారు అక్కడ గంట సేపు గడిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన్ను మళ్లీ పై అంతస్తుకు తీసుకువచ్చారు.
మరోవైపు అమెరికా కాలమానం ప్రకారం, ఆదివారం సాయత్రం అధ్యక్ష భవనం వద్ద నిరసన కారులు గుమికూడారు. దీంతో వాషింగ్టన్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు కొలంబియా మేయర్ మురియెల్ బౌసర్ తెలిపారు. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతుండటంతో వాటిని నిలువరించడానికి పోలీసులకు మద్దతుగా నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దింపామని ఆమె వెల్లడించారు.