కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. గత ఏడాది డిసెంబరులో చైనాలోని వూహాన్లో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి అనాతి కాలంలోనే ప్రపంచదేశాలు విస్తరించింది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకి హాస్పటల్ పాలయ్యారు. ఇలా మానవజాతిని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ను.. కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కరోనా గురించి కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నారు.
తాజాగా రాగితో కరోనాను అరికట్టవచ్చంటున్నారు బ్రిటీష్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ విలియం కీవిల్. వాస్తవానికి.. రాగిలో ఆంటీ బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుంది. అందుకే రాగితో చేసిన పాత్రలలోసూక్ష్మక్రిములు చేరే అవకాశం లేదు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలోనూ రాగి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ సీనియర్ మైక్రోబయోలజిస్ట్ అయిన ప్రొఫెసర్ విలియం దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ లోహాల యాంటీ బాక్టీరియల్ గుణాలపై పరిశోధనలు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వ్యాప్తిపై తన పరిశోధనలు మరింత ముమ్మరం చేసిన ఆయన.. రాగితో తయారు చేసిన లేదా రాగి పూత ఉన్న వస్తువులపై వైరస్ చేరినట్లయితే కేవలం నాలుగు గంటల్లోనే అది అంతమవుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే.. కాపర్పై వైరస్ చేరినపుడు దానిలోని అయాన్లు, ఎలక్ట్రాన్లు వైరస్ మెంబ్రేన్ పై దాడి చేసి.. డీఎన్ఏను నిర్వీర్యపరిచి.. దానిని పూర్తిగా నాశనం చేస్తుందని అంటున్నారు. అలాగే స్టీలుపై కరోనా మూడు రోజుల పాటు బతికి ఉంటే.. రాగిపై మాత్రం కేవలం నాలుగు గంటలు మాత్రమే జీవించి ఉండగలదని స్పష్టం చేశారు.
అందుకే మనం రోజూ ఎక్కువగా ఉపయోగించే డోర్ హ్యాండిల్స్, షాపింగ్ ట్రాలీలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, హ్యాండ్ రెయిల్స్, జిమ్ పరికరాలు, క్యాష్ మెషీన్లపై కాపర్ పూత వేసినట్లయితే మంచిదంటున్నారు. ఇక గతంలో అమెరికా శాస్త్రవేత్తల బృందం సైతం ఇంటెన్సివ్ కేర్లో రాగి పూత ఉన్న పరికరాలను వాడినపుడు.. మిగతా లోహాలతో పోలిస్తే బాక్టీరియాను చంపగల శక్తి 95 శాతం ఎక్కువగా ఉందని వెల్లడించింది.